కుటుంబ నియంత్రణ కోసం పురుషులు చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు ఆదరణ కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం ఒక్క వేసెక్టమీ కూడా నమోదు కాలేదు. గత ఆరేండ్లలో జిల్లా వ్యాప్తంగా ట్యూబెక్టమీలు 26,361, వేసెక్టమీలు 46 జరిగాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో 98 శాతం మంది మహిళలు ముందుంటుండగా 0.5 శాతంలోపు మాత్రమే పురుషులు ఉంటున్నారని తెలుస్తున్నది. పలు అపోహలతోనే మగవారు వేసెక్టమీకి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. దీనిపై వైద్యశాఖ విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం కనపడుతున్నది.
సూర్యాపేట, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఇప్పటికీ మహిళలకు సంబంధించిన అంశంగానే చూస్తున్నది పురుష సమాజం. పిల్లలు కలుగకుండా మహిళలను ట్యూబెక్టమీ చేయించుకోవాలని భర్తలు భార్యలపై వత్తిడి తెస్తున్నారే తప్ప తాము వేసక్టమీ చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు.
సాధారణంగా ప్రసవం సందర్భంగా జరిగే ఆపరేషన్ సమయంలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం వల్ల పురుషుల కంటే మహిళలకు చేసే ట్యూబెక్టమీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ కాన్పులు పెరిగాయి. ఈ క్రమంలో ట్యూబెక్టమీల సంఖ్య సైతం గణనీయంగా తగ్గింది. దాంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే సమయం వచ్చేసరికి భార్యలను ఆపరేషన్కు ప్రోత్సహిస్తూ భర్తలు పలాయనం చిత్తగిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో వేసక్టమీ ఆపరేషన్ల సంఖ్య 2 శాతం దాటడం లేదు. గత ఆరేండ్లలో జిల్లా వ్యాప్తంగా కేవలం 46 మంది పురుషులే శస్త్ర చికిత్సలు చేయించున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆపరేషన్ల సంఖ్య జీరోగా నమోదైందంటే క్షేత్రస్థాయి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళలు మాత్రం 26,361 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. వాస్తవానికి మహిళల కంటే మగవారికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ త్వరగా అయిపోతుంది. పురుషులకు కోత, కుట్టు లేకుండా ఆపరేషన్ చేస్తారు. బలహీనంగా అవడం వంటి అపోహలను నమ్మొద్దని, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని వైద్యులు చెబుతున్నారు.
అయినా పురుషులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలకు ట్యూబెక్టమీ చేయాలంటే పొట్ట లోపల గర్భాశయ నాళాలకు చేయాల్సి ఉంటుంది. దానికి తోడు వారికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. కానీ పురుషులకు వేసక్టమీ అనేది చాలా చిన్న విషయం అని డాక్టర్లు చెబుతున్నారు. వారికి మత్తు అవసరం లేకుండా వృషణాల నుంచి వీర్యకణాలు తీసుకెళ్లే నాళాలకు ఆపరేషన్ చేస్తారు. వేసక్టమీ అనంతరం అర్థగంటలోపే సాధారణంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లొచ్చు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకుండా ఇంకా మహిళలపైనే భారం మోపడం విచారకరమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.