నల్లగొండ, డిసెంబర్ 28 : ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మెరుగైన పాలన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా పాలన ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయ హస్తం ఐదు గ్యారెంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నల్లగొండ పట్టణంలోని పానగల్లో 1వ వార్డు, డైట్ కళాశాలలో 5వ వార్డు, 21వ వార్డులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో ఆయన మాట్లాడారు.
దరఖాస్తులను ఎలా నింపాలో వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు అధికారులు వివరాలు చదివి వినిపించి పథకం వారీగా సరిచూసుకొని నింపాలన్నారు. కుటుంబ సభ్యుల వివరాలతోపాటు అభయ హస్తం గ్యారెంటీ పథకాలు పొందేలా దరఖాస్తుదారులు ఆయా పథకాల ఎదురుగా టిక్ మార్ చేయాలని సూచించారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులు రూ.2500 ఆర్థిక సాయం దగ్గర టిక్ చేయాలన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ వద్ద టిక్ మార్ చేసిన వారు గ్యాస్ కంపెనీ పేరు, నెంబరు, సిలిండర్ల సంఖ్య నమోదు చేయాలని తెలిపారు. రైతు భరోసా పథకంలో భూముల వివరాలు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేనివారు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం వద్ద టిక్ చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు వివరాలు తెలుపాలని పేర్కొన్నారు.
గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల గృహ విద్యుత్ వినియోగం వివరాలు, చేయూత పథకంలో పింఛన్ల కోసం ఆయా విభాగం వద్ద టిక్ చేయాలన్నారు. దరఖాస్తులో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు విధిగా రసీదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలో 48 వార్లుల్లో మున్సిపల్, అంగన్వాడీ, మెప్మా, ఆశ వర్కర్లతో 48 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పది టీమ్లు ప్రత్యేకంగా అన్ని వార్డుల్లో పర్యటిస్తాయన్నారు. మున్సిపల్ కార్యాలయంలో కూడా దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ ఎస్ఈ చంద్రమోహన్, కౌన్సిలర్లు పున్న గణేశ్, ఇబ్రహీం పాల్గొన్నారు.