యాదాద్రి, ఆగస్టు 3: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాలు బుధవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణ తంతును నిర్వహించారు. మొదటగా సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు (విహార) సేవ, దర్బార్ సేవ వైభవంగా చేపట్టారు. రాత్రి 7 గంటలకు శ్రీస్వామివారి తిరువరాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠమూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన, పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో శివుడికి పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రాకార మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. యాదాద్రిలో బస చేసి గురువారం ఉదయం స్వామివారి నిజాభిషేకంలో పాల్గొననున్నారు. ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్ రూపొందించిన ‘శ్రీమాలిక’ గ్రంథాన్ని యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఏపీ పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రతినిధులు అందజేయగా, సీఎస్ సోమేశ్కుమార్ ప్రధానాలయ ముఖ మండపం అష్టోత్తర మూర్తుల వద్ద ఆవిష్కరించారు. కోటికుంకుమార్చనలో పాల్గొనే ముత్తయిదువులకు కానుకగా శ్రీమాలిక గ్రంథాన్ని అందజేయనున్నట్లు ఈఓ గీత తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనారసింహాచార్యులు, ఆర్డీఓ భూపాల్రెడ్డి ఉన్నారు.
వైభవంగా కోటికుంకుమార్చన
శ్రావణమాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రంలో చేపట్టిన శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన ఆరో రోజు వైభవంగా నిర్వహించారు. 30 మంది రుత్వీకులు అమ్మవారి సహస్రనామాన్ని పఠించారు. అలాగే పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు వైభవంగా చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. స్వామివారిని 10 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 14,46,964 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.