నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. బర్కత్పురలోని న్యూ స్టార్ ప్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీలో ఏసీకి ఉపయోగించే నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ మార్చే క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. కంపెనీ యజమాని షేక్ కలీం (44), ఆటో డ్రైవర్ సాజిద్(41) అక్కడికక్కడే మృతి చెందారు. వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి. రక్తం, మాంసపు ముద్దలతో ఆ ప్రదేశం భీతావహంగా మారింది. కొద్ది దూరంలో ఉన్న మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
– నీలగిరి, జూన్ 26
నీలగిరి, జూన్ 26 : నల్లగొండ జిల్లా కేంద్రం బర్కత్పుర కాలనీలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. న్యూస్టార్ ప్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీ గదిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్డ్ స్టోరేజీ యజమాని షేక్ కలీమ్ (44),అందులో పనిచేస్తున్న ఆటో డ్రైవర్ సాజిద్(41)స్టోరేజీ గదికి నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ను మారుస్తున్న క్రమంలో లీకై పెద్ద శబ్దంతో పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ పేలుడు ధాటికి ఇద్దరు శరీర భాగాలు తునాతునకలుగా చెల్లచెదురుగా పడ్డాయి. ప్రమాద సమయంలో మరో ఇద్దరు కూడా కంపెనీలోనే ఉన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఉన్న మరో ఇద్దరు(అన్సార్, మాజీద్) గదికి కొద్దిపాటి దూరంలో తమ పనుల్లో పనిచేసుకుంటున్నారు. ఒక్కసారిగా సిలిండర్ పేలి పెద్ద శబ్దం రావడంతో పనిలో ఉన్న ఇద్దరు వర్కర్లతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెగిపోయిన ఇరువురి శరీర భాగాలు కంపెనీలో వేర్వేరు ప్రాంతాల్లో పడిపోవడంతో ఆ ప్రాంతం అంతా భీతవాహాకంగా మా రింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థ్ధలానికి చేరుకుని తీరును పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డీఎస్పీ నర్సింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతర మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కలీం భార్య సాబేదా ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ రౌతు గోపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త పట్టణంలో వ్యాప్తించడంతో పట్టణ వాసులు పెద్ద ఎత్తున ప్రమాద స్థ్ధలానికి వచ్చారు.
ఎమ్మెల్యే కంచర్ల సంతాపం
సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదం పట్ల పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మహారాష్ట్ర నుంచి ఫోన్లో తెలిపారు.