కొత్తగా ఓటు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, బీఎల్ఓలు అందుబాటులో ఉన్నారు. యువతతోపాటు పలువురు వినియోగించుకున్నారు. ఆదివారం కూడా కార్యక్రమం కొనసాగనున్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎస్. వెంకట్రావ్తోపాటు పలుచోట్ల అధికారులు ఓటు నమోదు ప్రక్రియను పరిశీలించారు. పలుచోట్ల ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీలు నిర్వహించారు.
నీలగిరి, సెప్టెంబర్ 2 : కొత్త ఓటర్ల నమోదుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలనికలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ప్రత్యేక ఓటర్ క్యాంపెయిన్లో భాగంగా శనివారం నల్లగొండ పట్టణంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం, ఆదిత్య స్కూల్లోని పోలింగ్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలని అన్నారు. సెప్టెంబర్ 2,3 తేదీల్లో నిర్వహించే క్యాంపెయిన్ అవకాశాన్ని ప్రది ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు నిండబోయేవారు కూడా ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ ఎన్ రవి, తాసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
నకిరేకల్లో..
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ను అడిషనల్ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారి పాటిల్ హేమంత్ కేశవ్ శనివారం తనిఖీ చేశారు. కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలను, చనిపోయిన తొలగించిన వివరాలను బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రోత్సహించాలన్నారు. ఫారం 6,7,8 ప్రకారం ఓటరు నమోదు మార్పులు, చేర్పులను త్వరగా పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ నాయక్, ఆర్ఐ రాంప్రసాద్, బీఎల్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.