మునుగోడు, డిసెంబర్ 22 : మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ పాలకవర్గంతో కలిసి ప్రాచీన శివరామ ఆలయంలో పూజలు నిర్వహించి, చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి పాల్గొని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆర్ధికంగా బలపడిన వ్యక్తులు తమ గ్రామ అభివృద్ధికి సమయం కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తామని చెప్పారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అందరిని కలుపుకుని మునుగోడు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. ప్రత్యేక అధికారి, మునుగోడు సూపరింటెండెంట్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, పాల్వాయి చెన్నారెడ్డి, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Munugode : నూతన పాలకవర్గం గ్రామాభివృద్ధికి పాటుపడాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి