యాదాద్రి భువనగిరి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి కలెక్టరేట్.. జిల్లాలోనే పెద్దాఫీసు. అన్ని విభాగాల బాస్లు ఉండే సమీకృత కార్యాలయం. పెద్ద సార్.. కలెక్టర్ ఉండేదీ ఇక్కడే. ఎలాంటి సమస్య అయినా ఇక్కడే పరిష్కారం అవుతుందనేది జనం నమ్మకం. మండలాల్లో అధికారులు పట్టించుకోకున్నా కలెక్టరేట్ గ్రీవెన్స్లో దరఖాస్తు చేస్తే న్యాయం దక్కుతుందని భరోసా. కానీ ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. అధికారుల నిర్లక్ష్యంతో అర్జీదారుల అప్లికేషన్లు ఎక్కడికక్కడ పెండింగ్లోనే మూలుగుతున్నాయి. దీంతో ఒక్కో ఫిర్యాదారుడు నాలుగైనా సార్లు తిరుగుతున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
సగం వినతులు పెండింగ్లోనే..
సాధారణంగా ప్రతి సోమవారం సుమారు 70 నుంచి 100 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 1311 వినతులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు 688 మాత్రమే పరిష్కారమయ్యాయి. కాగితాలపై ఇన్ని దరఖాస్తులు పరిష్కరించామని కనిపిస్తున్నా.. అనేక వినతులను క్లియర్ చేయకుండా పక్కన పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా 623 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల్లో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి సంబంధించినవే. ఇప్పటి వరకు 833 దరఖాస్తులు రాగా, 433 డిస్పోజ్ చేయగా, మరో 410 వినతులు ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని విభాగాల అధికారులు ఉద్దేశపూర్వకంగానే వినతులను పరిష్కరించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. కాళ్ల చెప్పులరిగేలా తిరుగుతున్నా..సమస్యలు పరిష్కారం కావడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వినతులను పరిష్కరించేందుకు కృషి చేయాలని అర్జీదారులు కోరుతున్నారు.
వచ్చామా.. హాజరు వేసుకున్నామా.. పోయామా!
కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమం ఉంటుంది. దీనికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లతోపాటు జిల్లా అధికారులు హాజరవుతుంటారు. మారుమూల గ్రామాల నుంచి అన్ని వర్గాల వారు తమ గోడు వెళ్లబోసుకోవడానికి వస్తుంటారు. మండలాల్లో పరిష్కారంకాని సమస్యలతోపాటు పాటు ఇతర వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తుంటారు. ఉన్నతాధికారులు తీసుకున్న వినతులను ఆయా విభాగాల అధికారులు పంపిస్తారు. అయితే వాటిని పరిశీలించి అధికారులు, కింది స్థాయి అధికారులు పరిశీలించి.. నిజమైన సమస్యను గుర్తించి పరిష్కరించాలి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజావాణికి వచ్చామా.. హాజరు వేసుకున్నామా.. పోయామా.. అన్న చందంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వచ్చిన అప్లికేషన్లను వచ్చినట్టు పక్కన పడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని సెక్షన్లలో, మరికొన్ని మండల ఆఫీసుల్లో పెండింగ్ పడిపోతున్నాయి.
