మిర్యాలగూడ, మార్చి 21 : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్తంగా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు జాతీయ స్థాయి నందిని నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సాంస్కృతిక కళా కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు బోయినపల్లి భుజంగరావు, పులి కృష్ణమూర్తి తెలిపారు. గురువారం స్థానికంగా నాటకోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పట్టణంలోని మినీ రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈ నాటకోత్సవాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి నాటికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 15 దరఖాస్తులు రాగా తెలంగాణ నుంచి నాలుగు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు దరఖాస్తులను ఎంపిక చేశామన్నారు. సాంఘీక నాటక పోటీలకు తెలంగాణ నుంచి 13, ఏపీ నుంచి 27 దరఖాస్తులు రాగా తెలంగాణ నుంచి 4, ఏపీ నుంచి 8 దరఖాస్తులను ఎంపిక చేసినట్లు తెలిపారు. పోటీల్లో 9 పద్య, 12 సాంఘీక పోటీల ప్రదర్శన ఉంటుందన్నారు.
ప్రతి పోటీలో మొదటి బహుమతి రూ.50వేలతోపాటు బంగారు నంది అవార్డు, రెండో బహుమతి రూ.40 వేలతోపాటు వెండి నంది, మూడో బహుమతి రూ.30వేలతోపాటు రాగి నంది, సాంఘీక నాటక పోటీల్లో మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.20వేలు, మూడో బహుమతి రూ.15వేలు, పద్య నాటిక బృందానికి రూ.40 వేలు, సాంఘీక నాటిక బృందానికి రూ.20వేలు అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్రావు, శ్రీనివాస్శర్మ, లక్ష్మీనారాయణశర్మ, ఉపేందర్, రామావతారం పాల్గొన్నారు.