నార్కట్పల్లి, జనవరి 4 : పలు అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో నార్కట్పల్లి ఎస్ఐ సైదాబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. సైదాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ తరుణ్జోష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం వీఆర్కు అటాచ్ చేస్తున్నట్లు అప్పటి ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు.
పేకాట ఆడుతున్న వారికి, ఇసుక అక్రమ రవాణాదారులకు సపోర్ట్ చేస్తూ సైదాబాబు లబ్ధి పొందినట్లు ఆధారాలు ఉన్నట్లు అపూర్వరావు తెలిపారు. గతంలో చిట్యాల, మర్రిగూడ మండలాల్లో పనిచేసే క్రమంలో పేకాటగాళ్లకు చేదోడుగా ఉంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఐజీ విచారణలో తేలింది. గతంలో మిర్యాలగూడలో పనిచేసిన సమయంలోనూ సస్పెండ్ అవడం గమనార్హం.