నల్లగొండ, మే 7 : ఖమ్మం – వరంగల్ – నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగుర వేసేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎనుగుల రాకేశ్రెడ్డి మంగళవారం నల్లగొండలో నామినేషన్ వేశారు. ముందుగా నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్లో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు. అనంతరం మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతీరాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి రాకేశ్రెడ్డి ఏఆర్ఓ, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు లక్ష్మీగార్డెన్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే మండలిలో నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వృథా అవుతుందని, అధికారంలో ఉన్న పార్టీని ఆ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే అవకాశం ఉండదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్లలో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేస్తే.. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ బస్సు యాత్ర మొదలు పెట్టగానే సీఎం రేవంత్కు వణుకు మొదలై రైతు బంధు వేయడం మొదలు పెట్టారన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన చోట బీజేపీకి డిపాజిట్ రాలేదని, బీజేపీ గెలిచిన చోట కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదని, అప్పుడు ఆ రెండు పార్టీలు పరస్పర సహాయం చేసుకొని ఓట్లు వేయించుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ గెలవగానే కృష్ణానదిని కేఆర్ఎంబీకి అప్పగించారని, బీఆర్ఎస్ పోరుతోనే మళ్లీ అసెంబ్లీలో తీర్మానం చేశారని అన్నారు. గోదావరి నీళ్లను ఇచ్చంపల్లి ద్వారా కావేరిలో కలపడానికి ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నాడని, దాంతో కర్ణాటక, తమిళనాడుకు ప్రయోజనం జరిగి తెలంగాణకు తీవ్ర కరువు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆపడం ఒక్క కేసీఆర్ వల్లనే అవుతుందని, ఈ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా మెడలు వంచి గోదావరి నీళ్లను కాపాడుకుంటామని అన్నారు. మైనార్టీల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ఆ వర్గాలకు ఎలాంటి న్యాయం చేస్తలేదని పేర్కొన్నారు. దేవుడి పేరు చెప్పి మోదీ ఓట్లు వేయించుకుంటే, కాంగ్రెస్ మాత్రం దేవుండ్ల మీద ఒట్లు వేసి దండుకుంటున్నదని విమర్శించారు.
సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, యాదాద్రి, సూర్యాపేట జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్రెడ్డి, గుజ్జ దీపికాయుగంధర్రావు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నోముల భగత్కుమార్, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, పైళ్ల శేఖర్రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, పాల్వాయి స్రవంతి, రాంచందర్నాయక్, అన్నపూర్ణ, మందడి సైదిరెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, చెరుకు సుధాకర్గౌడ్, చింతల వెంకటేశ్వర్రెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, బోనగిరి దేవేందర్, కడారి అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.
గెలిపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతా
నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ప్రశ్నించే గొంతుక అయి నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఈ నియోజకవర్గం నుంచి అన్ని సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఈ సారి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే మండలిలో పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నిస్తా. బీఆర్ఎస్లో ఉన్న స్వేచ్ఛ బీజేపీలో ఉండదు. ఆ పార్టీలో నాకు కనీస గౌరవం ఇవ్వలేదు.
కేసీఆర్ ఎంతో గౌరవంతో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. మార్పు పేరుతో ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ర్టాన్ని ఆగమాగం చేసింది.
– ఎనుగుల రాకేశ్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి
కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మొద్దు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో మోసం మాటలు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మరోసారి నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేయవద్దు. గ్రాడ్యుయేట్లు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే సమస్యలు పరిష్కరించడానికి రాకేశ్రెడ్డి పోరాటం చేస్తారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్లలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే.. ఈ నాలుగు నెలల్లో సీఎం రేవంత్ సర్వనాశనం చేసి వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ప్రధానంగా రైతులను ఆగం చేసి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారు. కేసీఆర్ రైతును రాజుగా నిలబెట్టి రైతు బంధు పెడితే.. రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగ పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్.. తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ మోసాలు బయట పెట్టాలంటే ఎంపీలు, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మన అభ్యర్థులు గెలిస్తేనే ఈ ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు.
– మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతీరాథోడ్
కేసీఆర్ రాకతో జనంలో మళ్లీ కొత్త ఉత్సాహం
శాసనసభ ఎన్నికల తర్వాత కేసీఆర్ అనారోగ్యంతో మూడు నెలలు బయటకు రాలేదు, ఇటీవల ఆయన బయటకు రాగానే కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో కాంగ్రెస్కు వణుకు మొదలై ప్రజల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. గ్రాడ్యుయేట్లు రెండు సార్లు తనను ఎమ్మెల్సీగా గెలిపించారు. ఈ సారి రాకేశ్రెడ్డిని గెలిపించాలి. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిల్ తత్వం గ్రాడ్యుయేట్లకు తెలుసు. ఎక్కడా గెలవలేక కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చే తీన్మార్ మల్లన్నను చిత్తుచిత్తుగా ఓడించాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఇస్తామన్న జాబ్ క్యాలెండర్, 50వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ, నిరుద్యోగులకు రూ.4వేల భృతి, కాలేజీ అమ్మాయిలకు స్కూ టీలు, ఐదు లక్షల గ్యారెంటీలు ఎక్కడ పోయాయి. కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామనడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ ఉద్యోగులకు మం చి పీఆర్సీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు.
– పల్లా రాజేశ్వర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
రాకేశ్రెడ్డి గెలిస్తే 34 నియోజకవర్గాల్లో మనం గెలిచినట్లే
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 34 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటే.. అందులో మనం ఎక్కువ స్థానాల్లో ఓడిపోయాం. ఈ ఒక్క ఎమ్మెల్సీ గెలిస్తే మళ్లీ ఆయా నియోజకవర్గాల్లో మన ప్రాతినిథ్యం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో మన ఎమ్మెల్సీ కొట్లాడే అవకాశం ఉంటుంది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర పెట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి కేసులు పెడుతుంది. అలాంటి ఫాల్స్ కేసులకు భయపడవద్దు. గులాబీ సైనికులు శక్తివంచన లేకుండా కృషి చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి.
– గాదరి కిశోర్కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలవుతాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు మన వాళ్లు ఉంటే ఆ పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు మన అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పోరాటం చేయాలి. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నందునే తండాలన్నీ గ్రామ పంచాయతీలు అయ్యాయి. 4శాతం నుంచి పది శాతం ఎస్టీ రిజర్వేషన్లు పెరిగాయి.
– రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు