తెలంగాణలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఉద్యమాల ఖిల్లాగా పేరు పొందింది. జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపాలిటీ అన్నింటికంటే పెద్దది. 48 వార్డులు, 107 స్కాయర్ కిలోమీటర్ల విస్తీర్ణం, 51,164 నివాసాలు, 2,25,076 మంది జనాభా కలిగి ఉంది. నల్లగొండ మండలానికి సంబంధించిన 14 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన నల్లగొండను గత పాలకులు పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ నల్లగొండను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని పారదోలిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్రెడ్డిని గెలిపిస్తే నల్లగొండను తాను దత్తత తీసుకొని రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అభివృద్ధికి వందలకోట్లు విడుదల చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి గాదరి మారయ్య దశదిన ఖర్మకు 2021 డిసెంబర్ 29న నల్లగొండకు వచ్చిన సీఎం కేసీఆర్ అదే రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమై అభివృద్ధిపై చర్చించారు. నీలగిరి కళా భారతి నిర్మాణం కోసం గడియారం సెంటర్లో ఉన్న ఇరిగేషన్, ఆర్అండ్బీ కార్యాలయాల స్థలాలను పరిశీలించారు. నల్లగొండ మున్సిపాలిటీకి డా కేవీ. రమణాచారిని కమిషనర్గా నియమించారు. ఆయన నేతృత్వంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
నీలగిరి పట్టణాన్ని సుందరీకరిస్తూ ప్రధాన రహదారులు, పార్కులు, జంక్షన్లు సెంట్రల్ లైటింగ్, రోడ్డుకు ఇరువైపులా డ్రైన్లు, ఫుట్పాత్లు, పురాతన ఆలయాలైన పానగల్లును పర్యాటక కేంద్రంగా , నల్లగొండ పట్టణానికే తలమానికంగా ఐటీ హబ్ నిర్మాణం, కార్పొరేట్ దవాఖానకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం అందించే విధంగా మెడికల్ కళాశాల, వెజ్, నాన్వెచ్ మార్కెట్ వంటి నిర్మాణాలకు సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.1000కోట్లు మంజూరు చేశారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విజ్ఞప్తితో రూ.36కోట్లు కేటాయించగా ఎన్జీ కళాశాల నూతన భవన నిర్మాణం జరుగుతున్నది.
నల్లగొండ పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు అమృత్ , మిషన్ భగీరథ ద్వారా 16 ట్యాంకుల నిర్మాణంతో ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దేందుకు రూ.216 కోట్లు కేటాయించారు. పట్టణంలో 33 కిలోమీటర్ల ప్రధాన రోడ్డు, పలు జంక్షణ్లను అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ అమరుస్తుండడంతో పట్టనం కాంతులీనుతోంది. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా మర్రిగూడ బైపాస్ జంక్షన్, పానగల్ బైపాస్ జంక్షన్లలో రూ.90కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతున్నది. హిందూపూర్లో ఆధునిక పద్ధతిలో రూ.3 కోట్లతో వైకుంఠధామం నిర్మిస్తున్నారు. నల్లగొండ పట్టణ నలుదిక్కుల రూ.2కోట్లతో భారీ స్వాగత ఆర్చీలు ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టేడియం ఆధునీకరణ, జిల్లా కేంద్రంలో రూ.4.20 కోట్లతో హెలీప్యాడ్ నిర్మించారు. పానగల్ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ.139కోట్ల 21లక్షలు మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయి. పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం వద్ద రూ.10.50కోట్లతో శిల్పారామం నిర్మించనుండడం శుభ పరిణామం.
దీని వల్ల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింభించే హస్తకళలు తదితర వ్యాపారాల స్టాల్స్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు కోసం, పర్యాటకులు సేద తీరడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో సూపర్ స్పెషాల్టీ వైద్యం అందేలా ఆధునిక వైద్య పరికరాలతో అన్ని రంగాల్లో 500 మంది డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు, పీజీ విద్యార్థులు అందుబాటులో ఉండనున్నారు. దాంతో పాటు ఎస్ఎల్బీసీలో రూ.275 కోట్లతో 5 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నారు. రూ.90.61కోట్లతో 5ఎకరాల స్థలంలో గడియారం సెంటర్లో ఆధునిక పద్ధతిలో నీలగిరి కళాభారతిని నిర్మిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మైసయ్య విగ్రహం దగ్గర హరేరామ వారి సహకారంతో పేదలకు రూ.5కే భోజనం
అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి అయ్యే రూ.26.25పైసలు మున్సిపాలిటీ భరిస్తున్నది.
పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. డీఎంఎఫ్టీ నిధులతో స్వీపింగ్ మిషన్లు, ట్రాక్టర్లు, ఆటోలు, మురుగు కాల్వల్లో షిల్ట్ తీయడానికి, దారుల వెంట కంపచెట్లు. తొలగించడానికి, జేసీబీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి క్లీన్ చేయడానికి మిషన్లు కొనుగోలు చేశారు.
మున్సిపాలిటీతో పాటు, నల్లగొండ మండలంలోని 23 గ్రామాలు, తిప్పర్తి మండలంలోని 9 గ్రామాలు కనగల్ మండలంలోని 6 గ్రామాలు, కట్టంగూర్ మండలంలోని పిట్టంపల్లి, నకిరేకల్ మండలంలోని రెండు గ్రామాలతో కలిపి నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) ఏర్పాటు చేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. చైర్మన్గా నల్లగొండ కలెక్టర్, వైస్ చైర్మన్గా మున్సిపల్ కమిషనర్, నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు, అధికారులు సభ్యులుగా ఉన్నారు. వీరు నెలలో ఒకసారి నల్లగొండ అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు జరుపుతూ ముందుకెళ్తారు.
సీఎం కేసీఆర్ సారధ్యంలో, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ నిరంతర కృషితో అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నల్లగొండ పట్టణం. చుట్టూ ప్రకృతి వనాలు, ప్రత్యేక ఆకర్షణగా మారిన జంక్షన్లు, పార్కులతో చూడ చక్కగా రూపు దిద్దుకుంటున్నది. అభివృద్ధి కాంతులీనుతున్న నల్లగొండ పట్టణాభివృద్ధి చరిత్రలో నిలిచి పోనున్నది.
నల్లగొండ చరిత్రను పునర్ లిఖించే విధంగా, నాడు అలుపెరుగని పోరాటాలు నేడు అంతులేని అభివృద్ధితో నల్లగొండ జిల్లా కేంద్రం మారడానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక చొర ఎంతో ఉంది. సీఎం కేసీఆర్కు అనుంగ శిష్యుడిగా పేరున్న మంత్రి జగదీశ్రెడ్డి అభివృద్ధి మంత్రంతో నల్లగొండ పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నిరంతర పర్యవేక్షణ చేస్తూ దూరదృష్టితో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నాణ్యతాయుతంగా పనులు జరిగేలా, అవికూడా వేగవంతంగా పూర్తయ్యే విధంగా కృషి చేస్తున్నారు.
– కొండూరు సత్యనారాయణ ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్, నల్లగొండ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సెల్ : 9154383679