వంటగ్యాస్ విషయంలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డీలర్లను పౌరసరఫరాల శాఖ నల్గొండ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ( Machana Raghunandan ) హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్లను సకాలంలో డెలివరీ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలదే అని.. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. దేవరకొండలోని గ్యాస్ ఏజెన్సీని మాచన రఘునందన్ గురువారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఏజెన్సీ సేవలు బాధ్యతారాహిత్యంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్గా విక్రయిస్తున్నట్లు మాచన రఘునందన్ దృష్టికి రావడంతో సదరు ఏజెన్సీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో పాటు వంటగ్యాస్ డోర్ డెలివరీలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలియడంతో మండిపడ్డారు. వినియోగదారులు రశీదు మీద ఉన్న మొత్తం మాత్రమే చెల్లించాలని స్పష్టం చేశారు. ఎవరైనా సిబ్బంది ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా.. లేదా సకాలంలో డోర్ డెలివరీ చేయకపోయినా స్థానిక తహసీల్దార్ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.