అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందనినల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు. ఇప్పటికే షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు, మద్యం పంపిణీని కట్టడి చేయడంతోపాటు ఇతర ప్రలోభాలపైనా ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
నగదు రవాణావిషయంలో రూ.50వేలకు మించి ఉంటే తగిన ఆధారాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులతోపాటు ర్యాండమ్ చెకింగ్లు కొనసాగుతాయని చెప్పారు. ఇంకా ఫ్లైయింగ్ స్కాడ్ల ఏర్పాటు, రౌడీషీటర్లు, పాత నేరస్తుల బైండోవర్లు, సమస్యాత్మక గ్రామాల్లో చర్యలు, పార్టీ మీటింగ్ల అనుమతులు, ప్రచార సమయం, సోషల్ మీడియాపై నిఘా, అదనపు బలగాల రాక,తదితర అంశాలను నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్10(నమస్తే తెలంగాణ) : ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పోలీసు శాఖ ఎన్నికల సంఘం పరిధిలో డిప్యూటేషన్గా పని చేస్తున్నట్లుగా లెక్క. ఎన్నికల సంఘం నిబంధనలు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాం. రాష్ట్రంలోనే ఆరు నియోజకవర్గాలతో పెద్ద జిల్లాగా నల్లగొండ ఉంది. ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే మా లక్ష్యం. ఇప్పటికే పలు దఫాలుగా ఎన్నికల విధులపై సిబ్బందికి అవగాహన కల్పించాం. జిల్లా పోలీసులు అన్ని విధాలుగా సిద్ధ్దంగా ఉన్నారు. నోటిఫికేషన్ నుంచి జిల్లా సిబ్బందికి తోడుగా కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగుతాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పూర్తి అప్రమత్తతో పకడ్బందీగా వ్యవహరిస్తాం.
ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు, మద్యం పంపీణిలకు అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యం. వీటితో పాటు ఇతర ప్రలోభాలను కట్టడి చేస్తాం. ఇందుకోసం నిరంతరం చెకింగ్లు జరుగుతాయి. వాడపల్లి, అడవిదేవులపల్లి, నాగార్జునసాగర్లలో అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయి. 18 ఫ్లైయింగ్ స్వాడ్లు ఇప్పటికే రంగంలో ఉన్నాయి. నోటిఫికేషన్ నాటి నుంచి విస్త్రత తనిఖీలు ఉంటాయి. వీటిపై ఫిర్యాదు కోసం సీ-విజిల్ యాప్ అందుబాటులో ఉంది. ఎవరైనా నేరుగా సమాచారం ఇచ్చినా స్పందిస్తాం.
నగదు రవాణా విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నాయి. రూ.50 వేలకు మించి డబ్బు ఉంటే తగిన ఆధారాలు వెంట ఉండాలి. ముఖ్యంగా ఆ డబ్బు రాజకీయ పార్టీలు, అభ్యర్థ్ధులకు సంబంధించినదిగా తేలితే వెంటనే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. హాస్పిటల్ అవసరాలు, వ్యవసాయ, వ్యాపార సంబంధిత డబ్బుగా తేలితే వెంటనే సదరు వ్యక్తులకే అప్పజెప్పేలా ఆదేశాలు ఉన్నాయి. సామాన్యులు సైతం అనవసరంగా పరిమితికి మించిన డబ్బును వెంట తీసుకెళ్లకపోవడమే మంచిది. నగదు, డబ్బు పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయి.
జిల్లా పరిధిలోని రౌడీషీటర్లను, పాత నేరస్తును ఇప్పటికే ఆయా పోలీసు స్టేషన్ల వారీగా గుర్తించాం. ఇప్పటికే వీరిలో 2వేల మంది వరకు ఎక్కడికక్కడే బైండోవర్లు చేశాం. ఎన్నికల సమయంలో ఏలా ఉండాలో ఒక దఫా కౌన్సెలింగ్ ఇచ్చాం. పోలింగ్ నాటికి మరో సారి కూడా కౌన్సెలింగ్ ఇస్తాం. ఎన్నికల్లో ఘర్షణలకు, హింసకు ఎవ్వరూ పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయి. సమస్యాత్మక గ్రామాలను కూడా ఇప్పటికే గుర్తించాం. వీటిల్లో సీనియర్ అధికారులతో నిరంతర నిఘా కొనసాగుతున్నది. ఇక్కడ అవసరాన్ని బట్టి అదనపు బలగాలను కూడా దించుతాం. ఆయా పార్టీలు, అభ్యర్థ్ధులు కూడా శాంతియుత ఎన్నికలకు సహాకరించాలని విజ్ఞప్తి.
ఎన్నికల్లో ప్రస్తుతం సోషల్ మీడియా పాత్ర కూడా కీలకంగా మారింది. పార్టీలు, అభ్యర్థ్ధులు తమ ప్రచారానికి వేదికగా మార్చుకున్నారు. సోషల్ మీడియాలో పార్టీలు, కులాలు, మతాల పేరుతో ఇతరులను రెచ్చగొట్టేలా, ఘర్షణకు తావిచ్చేలా ఎవ్వరూ కామెంట్స్ పెట్టినా, పోస్టులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘాను ఏర్పాటు చేశాం. ఇలాంటి వాటిపై నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చినా చట్టపరంగా చర్యలు చేపడతాం.
ఎన్నికల సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు పోలీసు శాఖ అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం. ఇందు కోసం ప్రత్యేకంగా సువిధ యాప్ కూడా అందుబాటులో ఉంది. యాప్లో లేదంటే నేరుగా కూడా అనుమతి కోసం దరఖాస్తు చేయవచ్చు. నామినేషన్ల దాఖలు సమయంలోనూ ర్యాలీలు, మీటింగ్లకు ముందే అనుమతి తీసుకోవాలి. ఇక లౌడ్ స్పీకర్లు, ప్రచారం కోసం వినియోగించే వాహనాలకు సైతం అనుమతి తీసుకోవాలి. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ప్రచారానికి అనుమతి ఉంది. దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.