గరిడేపల్లి, జూలై 29 : మండలంలోని పరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అంబటి సత్యనారాయణరెడ్డి కరోనా బారిన పడి వైద్యం కోసం భారీగా ఖర్చు పెట్టాడు. అయినా ప్రాణాలు నిలువలేదు. ఆర్థికంగా ఇబ్బందులతో ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో రూ.10 లక్షలు మంజూరయ్యాయి. శుక్రవారం సంబంధిత చెక్కును ఎమ్మెల్యే సైదిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి భార్య, ఆయన కుటుంబ సభ్యులు కంటనీరు పెట్టడంతో వారిని ఓదార్చారు.
పార్టీలకు అతీతంగా సాయం చేయడంపై ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. అలాగే గరిడేపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ మెటికెల చందు సైతం కరోనాతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు, సర్వారం గ్రామానికి చెందిన సాముల వెంకమ్మకు రూ.60 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమాల్లో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధక్షుడు గుగులోతు కృష్ణానాయక్, పరిశీలకుడు పిడమర్తి రాజు, సర్పంచులు వీరంరెడ్డి లక్ష్మి, టి.సీతరాంరెడ్డి, వైస్ సర్పంచ్ సైదాబీ రాజ్మహ్మద్, సర్వారం పీఏసీఎస్ చైర్మన్ వీరంరెడ్డి శంభిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.