గరిడేపల్లి, డిసెంబర్ 17: జింక్ ధాతువు.. పైరు ఎదుగుదలకు అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం. దీని లోపంతో పంటల దిగుబడులు బాగా తగ్గిపోతాయి. 20 సంవత్సరాలుగా మార్కెట్లోకి అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు వస్తున్నప్పటికీ జింకు లోపం కారణంగా పలుచోట్ల ఆశించిన పంట రావడం లేదు. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడంతో సూక్ష్మధాతు లోపాలు ఉత్పన్నమవుతున్నాయి. సూక్ష్మధాతు పోషకాల్లో ముఖ్యమైనది జింక్. ఇది పంట ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. ఇంత ప్రాధాన్యత గల జింక్ లోప నివారణకు తగిన జాగ్రత్తల గురించి వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.
నివారణ చర్యలు
జింక్ సల్ఫేట్ను నేలలో వాడడం, ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల జింక్ ధాతువు లోపాన్ని నివారించవచ్చు. నేలలో వేసిన జింక్ పోషకానికి కదలిక చాలా తక్కువ. కాబట్టి నీటిలో కొట్టుకుపోయే స్వభావం ఉండదు. దాంతో మొక్క సరిపడినంత తీసుకోగా.. మిగిలింది తర్వాత పైరుకు ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ నేలలకు ఎకరాకు 20కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. ఇది రెండు లేక మూడు పంటలకు సరిపోతుంది. చౌడు భూములైతే ఎకరాకు 40కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. సాధారణ భూముల్లోనూ జింక్ వాడవచ్చు. కానీ.. సమస్యాత్మక భూముల్లో పిచికారీ చేసి లోపాన్ని సవరించుకోవాలి. సాధారణంగా వరిలో జింక్ సల్ఫేట్ను చివరి దుక్కిలో గానీ, నాటే సమయంలో గానీ వేసి భూమిలో బాగా కలిసేటట్లు చేయాలి. వరి నారు మడిలో అయితే రెండున్నర సెంట్లకు కిలో జింక్ వెదజల్లి నారు పోసుకోవాలి. పైరు మీద జింక్ లోపం గమనించగానే 0.2 శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని లీటరు నీటికి రెండు గ్రాములు చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. చిలేటెడ్ జింక్ వాడేవారు ఎకరాకు 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పైరు అంతటా తడిసేలా పిచికారీ చేయాలి. మురుగు నీటి సమస్య ఉంటే తప్పనిసరిగా తొలగించి మంచి నీరు పెట్టుకోవాలి. మురుగు దమ్ముకు, కరిగట్టు దమ్ముకు కనీసం పది రోజుల వ్యవధి లేనట్టయితే జింక్ సల్ఫేట్ను భూమిలో వేసేకంటే పైరుపై పిచికారీ చేయడం మంచిది. దీని ద్వారా ఖర్చు తగ్గుతుంది. జింకు ద్రావణంలో ఏ పురుగు మందునూ కలుపకూడదు. భాస్వరం ఎరువుతోనూ కలిపి వేయరాదు.
జింక్ లోపం ఏర్పడే ప్రాంతాలు
అధిక వర్షపాతం, ఎక్కువగా సాగు చేపట్టే ప్రాంతాలు, గరప నేలలు, చౌడు భూములు, అధిక భాస్వరం పరిమాణం కలిగిన భూములు, తక్కువ సేంద్రియ కర్బనం కలిగిన నేలలు, ఎక్కువ పోషకాలు కలిగిన జింక్ రహిత రసాయన ఎరువులు వాడిన నేలలు, భూమిలో పోషకాల సమతుల్యత లోపం, కొత్తగా సాగులోకి తెచ్చిన భూములు.
సబ్సిడీపై ప్రభుత్వం అందజేత
జింక్ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం రైతుల అవసరాన్ని, అవకాశాన్ని బట్టి సబ్సిడీపై అందిస్తున్నది. ఎకరాకు అవసరమైన 20 కిలోల జింక్ రూ.600 వరకు ఉండగా, ప్రభుత్వం 33శాతం సబ్సిడీ ఇస్తున్నది. రైతు రూ.400 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
పైరు ఎదుగుదలలో కీలక పాత్ర
పంట పెరుగుదలకు ప్రధాన పోషకాలు ఎంత అవసరమో జింక్ అంతే అవసరం.
మొక్కలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ అందుబాటులో ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాలు లోపిస్తే పంటల పెరుగుదల ఆగిపోయి దిగుబడులు తగ్గుతాయి.
సూక్ష్మ పోషకాల్లో ముఖ్యమైనది జింక్. పంట ఎదుగుదలకు కావలసిన ఆక్సిన్ ఐఏఏ (ఇండోల్ అసిటక్ యాసిడ్) హార్మోన్ తయారు కావడానికి ఉపయోగపడుతుంది.
కార్బోనిక్ ఎన్-హైడ్రేజ్, ఆల్కహాల్- డీ హైడ్రోనేట్ వంటి ఎంజైమ్లలో జింక్ ఒక ముఖ్య భాగం.
ఇది మొక్కల్లో అమైనో ఆమ్లాలు, మాంసకృత్తులు తయారు కావడానికి దోహదపడుతుంది.
నత్రజని, భాస్వరం పోషకాల సమర్థ వినియోగానికి జింక్ ఉపయోగపడుతుంది.
కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరుగడానికి ఇది తప్పనిసరి.
భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి
పంట పొలాల్లో ముందస్తుగా భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా ఎరువులు వాడాలి. ముఖ్యంగా జింక్ లోపం ఉన్నట్లయితే మొక్కల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారుతుంది. కొత్త ఆకులు చిన్నవై మొక్క కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఆకులపై తుప్పు రంగు మచ్చలేర్పడుతాయి. దాంతో మొక్కలు సక్రమంగా ఎదుగక దిగుబడులు బాగా తగ్గిపోతాయి. లోపాన్ని నివారించేందుకు జింక్ సల్ఫేట్ను భూమిలో వేయాలి. దీనిని ఇతర ఎరువులతో కలిపి వాడకూడదు. సమస్యాత్మక భూములైతే నేరుగా పిచికారీ చేయడమే మేలు. ఇందులోనూ ఇతర రసాయన మందులు కలిపి వాడవద్దు.
– అరిగెల కిరణ్, కేవీకే మృత్తికా శాస్త్రవేత్త, గడ్డిపల్లి