యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఆరోగ్యలక్ష్మి పథకం జిల్లా వ్యాప్తంగా అద్భుతంగా అమలవుతున్నది. మాతాశిశు మరణాల సంఖ్య తగ్గించడంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. మహిళ గర్భం దాల్చింది మొదలు బిడ్డకు జన్మినిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరే వరకు ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి చూసుకుంటున్నది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నది. గర్భిణులు, చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. పోషణ్ అభియాన్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నది. వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నది. దాంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణుల సంఖ్య పెరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ జన్మించి దవాఖాన నుంచి ఇంటికి చేరే వరకు ప్రభుత్వమే దగ్గరుండి చూసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ సమర్థంగా అమలు చేస్తూ దేశ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న విషయం తెలిసిందే. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం ఉండొద్దని సీఎం కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. అంతేగాకుండా వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, రిఫరల్ సర్వీసులు అందిస్తున్నది.
నిత్యం 89,674 మందికి పౌష్టికాహారం..
నల్లగొండ జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద 9 ఐసీడీఎస్ ప్రాజెక్ట్లుండగా మొత్తం 2093 సెంటర్లు నడుస్తున్నాయి. నిత్యం 89,674 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇందులో 10,755 మంది గర్భిణులు, 9,901 మంది బాలింతలు, 7 నెలల నుంచి 3 ఏండ్లలోపు చిన్నారులు 44,345, మూడు నుంచి 6 ఏండ్లలోపు చిన్నారులు 24,673 మంది ఉన్నారు.
పౌష్టికాహారం ఇలా..
అంగన్వాడీ కేంద్రాల్లో నిత్యం పప్పు, కూరగాయలు, ఆకుకూరలతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. దీంతోపాటు రోజుకు 200 మిల్లీ లీటర్ల వేడి పాలు, ఉడకబెట్టిన గుడ్డు అందిస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేండ్ల చిన్నారులకు రోజుకు ఉడకబెట్టిన గుడ్డుతో పాటు నెలలో 16 గుడ్లను చిన్నారుల ఇంటికి పంపిస్తున్నారు. మూడేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో రోజుకు ఉడకబెట్టిన గుడ్డుతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, రక్త హీనత, శరీర బలహీనత లేకుండా దోహదపడుతున్నది. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులతో కమిటీలు ఏర్పాటు చేసి పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
‘పోషణ్ అభియాన్’ ద్వారా పర్యవేక్షణ..
జిల్లాలో 2018 మార్చి 8న పోషణ్ అభియాన్ ప్రారంభమైంది. దీని ద్వారా ఆరేండ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు పెరిగేలా చూసి మరుగుజ్జు తనాన్ని నివారించడం, ఎత్తుకు తగిన బరువు ఉండేలా, రక్త హీనత తగ్గింపునకు కృషి చేస్తున్నారు. దీని అమలుకు జిల్లాలో ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేశారు. 15 ఏండ్ల నుంచి 49 ఏడ్ల వయస్సు గల మహిళలు, యువతుల్లో రక్తహీనత తగ్గించడం, చిన్నారులు తక్కువ బరువుతో పుట్టడాన్ని తగ్గించడమే లక్ష్యంగా అమలవుతున్నది. అంగన్వాడీ టీచర్లు తమ వద్ద ఉన్న స్టార్ట్ ఫోన్ల ద్వారా డేటాను ఆన్లైన్లో ఫీడ్ చేస్తున్నారు. ఇండికేటర్స్ను ఏర్పర్చుకొని ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
నిత్యం పౌష్ఠికాహారం అందిస్తున్నారు
ప్రతి రోజూ క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి వెళ్తాను. అరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా నిత్యం పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. సరైన పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం అందించడంతో పాటుగా అంగన్వాడీ టీచర్ తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆకుకూరలతో పాటు, పప్పు, పాలు, గుడ్డును అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.
– జమ్ముల సంతోష, చందుపట్ల, భువనగిరి మండలం