మునుగోడు, డిసెంబర్16 : కొవిడ్-19 మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కొంతమంది విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలు తీవ్రంగా తగ్గాయి. ప్రధానంగా తెలుగు మాధ్యమానికి ఏటా ఒక్కో తరగతి చొప్పున మారుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఆంగ్ల పఠనంపై మరింత ప్రభావం పడింది. విద్యార్థుల సమగ్ర ప్రగతికి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నారు. ఇదే తరహాలో పఠన, భాషా నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ‘రీడింగ్ ఛాలెంజ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో అమలు ఇలా..
ప్రతి పీరియడ్లో పఠనానికి మొదటి 10-15 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో ఒక్కో సబెక్టుకు ఇద్దరు సీఆర్టీలను ఇన్చార్జిలుగా నియమించారు. వీరు నిత్యం ఆ రోజు చదువాల్సిన అంశాన్ని సామాజిక మాధ్యమం(వాట్సాప్ గ్రూప్) వేదికగా సమాచారం అందిస్తారు. దీని ప్రకారం సంబంధిత అంశాన్ని పాఠశాలల్లో చదివిస్తూ రికార్డింగ్ చేస్తారు. దీన్ని మళ్లీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేస్తారు. వీటిని ఆయా సబ్జెక్ట్ల ఇన్చార్జిలు ప్రతి రోజూ విని ఉత్తమ పఠనాన్ని ఎంపిక చేస్తారు. ఫలితంగా ఉత్తమ స్థానంలో నిలువాలనే పోటీతత్వం విద్యార్థులు, సీఆర్టీల్లోనూ పెంపొందుతుంది.
రీడింగ్ చాలెంజ్ ఉపయుక్తం..
2019-20 విద్యా సంవత్సరంలో కేజీబీవీలను ఆంగ్ల మాధ్యమం పాఠశాలలుగా మార్చారు. ఆ విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించి ఏటా ఒక్కో తరగతిని అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 9వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా, పదో తరగతి తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి వరకూ పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమంలోకి మారనున్నాయి. అయితే ఆంగ్ల మాధ్యమం ప్రారంభించిన సంవత్సరం నుంచే కొవిడ్ పరిస్థితులు తలెత్తడంతో విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలు తగ్గిపోయాయి. వాటిని అధిగమించేందుకు ఈ రీడింగ్ ఛాలెంజ్ ఉప యుక్తమవుతున్నది.
గతం కంటే మెరుగయ్యాం
మా పాఠశాలలో రీడింగ్ ఛాలెంజ్ను బాగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ప్రతి సబ్జెక్టులో నిర్ణయించిన పాఠాన్ని అందరితో చదివిస్తున్నారు. దీనివల్ల గతం కంటే పాఠాలను మెరుగ్గా చదువగలుగుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా తప్పులు లేకుండా చదువడం, విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
–ఎం.మనీషా, 8వ తరగతి
పిల్లల్లో పోటీతత్వం పెరుగుతుంది
ప్రతి రోజూ రీడింగ్ ఛాలెంజ్ నిర్వహణ ద్వారా పిల్లల్లో పోటీతత్వం పెరుగుతుంది. సీఆర్టీల సహకారంతో విద్యార్థులు పఠనానికి ఆసక్తి చూపుతున్నారు. వెనుకబడిన పిల్లల పఠనా సామర్థ్యాలు పెంచేలా ప్రయత్నిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం అమలు చేయనుండడంతో ఇది వారికి పూర్తిస్థాయిలో ఉపయుక్తంగా ఉంటుంది.
–జె.సంధ్యారాణి, ఎస్ఓ, కేజీబీవీ, మునుగోడు