గరిడేపల్లి, డిసెంబర్ 16 : వివిధ పంటల సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సత్ఫలితాలు సాధించొచ్చు. సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. వివిధ పంటల్లో ఈ నెలలో చేపట్టాల్సిన పనులు, పద్ధతుల గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డి.నరేశ్ వివరించారు. మరింత సమాచారం కోసం 9290 615952లో సంప్రదించాలని సూచించారు.
వరి : నవంబర్లో నారు పోసిన వారు ఈ నెలలో నాటు వేయాలి. ముఖ్యంగా నెలలోపు నాట్లు వేస్తే మంచిది. ఏకవార్షిక గడ్డి, తుంగజాతి కలుపు సమస్య ఉంటే బ్యూటాక్లోర్ను హెక్టారుకు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్లు లేదా అనిలోగార్డ్ 1.25 లీటర్లు 10 కిలోల ఇసుకలో కలిపి నాటిన 3-5రోజుల్లో అంగుళం వరకు నీరు ఉంచి చల్లాలి. ఊద సమస్య అధికంగా ఉంటే బెంథియోకార్బ్ హెక్టారుకు 3 లీటర్లు వంద కిలోల ఇసుకలో కలిపి సమానంగా చల్లాలి. వెదజల్లే పద్ద్ధతిలో గానీ, డ్రమ్ సీడర్తో గానీ విత్తనాలు వేస్తే 15 -20 రోజులకు కలుపు మందు పిచికారీ చేయాలి.
పెనాక్సిలమ్ 400 మి.లీ., బిస్పైరి బాక్ సోడియం 100 మి.లీ. ఎకరాకు లేదా పెనాక్సిలమ్+సైహాలోపాప్ బ్యుటైల్ 800 మి.లీ. బిస్ పైరిబాక్ సోడి యం 100 మి.లీ. పిచికారీ చేస్తే గడ్డి, వెడల్పాకు జాతిమొక్కలు నశిస్తాయి. కలుపు మందు పిచికారీ చేసిన కొద్ది రోజులకు ఎకరాకు సుమారు 30 కిలోల యూరియా వేయాలి. ప్రస్తుతం చలి తీవ్రత ఉన్నందున నారు మడిలో గానీ నేరుగా విత్తిన వరిలో గానీ జింక్ లోపం ఉండే అవకాశం ఉన్నది. దీని నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను పిచికారీ చేసుకోవాలి. ఎరువులకు సంబంధించి హెక్టారుకు 120 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులు వేయాలి. నత్రజని మూడు సమ భాగాలుగా చేసి నాట్లు వేసేటప్పుడు, నాటు వేసిన 10-12 రోజులకు, మిగిలిన భాగం అంకురార్పణ దశలో వేయాలి.
మొక్కజొన్న : యాసంగి పంటగా నవంబర్ 15లోగా విత్తిన మొక్కజొన్న పైరు వయస్సు 30-35 రోజుల్లోపు ఉన్నప్పుడు అంతర కృషి చేసి హెక్టారుకు 75 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువు వేయాలి. పై పాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగిన తేమ ఉండేలా చూసుకోవాలి. 30- 40 రోజులున్న పైరుకు అధిక నీరు అందివ్వడం హానికరం. యాసంగి మొక్కజొన్నను ఎక్కువగా గులాబీ రంగు కాండం తొలుచుపురుగు ఆశిస్తుంది. పైరు మొలకెత్తిన 10- 20 రోజుల నుంచి ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 320 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25-30 రోజులకు ఆకు సుడులలో వేయాలి.
కంది : వానకాలం పంటగా వేసిన దీర్ఘకాలిక కంది రకాలు పూత, కాయ ఏర్పడే దశలో ఉన్నందున శనగపచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు ఎక్కువగా ఆశించి పంటను నాశనం చేస్తాయి. దీని నివారణకు తొలి దశలో క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ., క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా క్లోరాంత్రానిలిప్రోల్ 60 మి.లీ. వేపనూనెతో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందును వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగు ప్రభావం తగ్గకుంటే లీటరు నీటికి ఇండాక్స్ కార్బ్ 1 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంత్రానిలిప్రోల్ 0.3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
మారుకా మచ్చల పురుగు ఆకులను, పూతనంతా ఒక దగ్గరకు చేర్చి గూడుగా మార్చి నష్టపరుస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ.+ డైక్లోరోవాస్ 1 మి.లీ. చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే థయోడికార్బ్ 1 గ్రాము లేదా స్పైనోసాడ్/ ప్లూ బెండమైడ్ 0.3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
శనగ : యాసంగిలో సాగు చేసిన శనగ పైరుకు ఈ నెలలో సాధారణంగా పచ్చపురుగు లేదా రబ్బరు పురుగు ఆశించి నష్టం కలుగజేస్తుంది. వీటి నివారణకు తొలి దశలో లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే లీటరు నీటికి స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా డై ప్యూ బెంజురాన్ 1మి.లీ. చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేయాలి.
వేరుశనగ : అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు వేసిన వేరుశనగ పైరు ప్రస్తుతం పూత దశలో ఉన్నందున చివరి సారిగా అంతర కృషి చేసి హెక్టార్కు 500 కిలోల జిప్సం 5సెం.మీ. లోతులో మొక్క దగ్గర వేసి మట్టితో ఎగదోసి నీరుపెట్టాలి.
పొద్దుతిరుగుడు : ఆరుతడి పంటగా నవంబర్లో వేయడానికి వీలుగాని పరిస్థితుల్లో ఈ నెలలో విత్తుకోవచ్చు. హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవ డం మంచిది. హైబ్రిడ్ రకాల్లో కేబీఎస్హెచ్-44, ఎన్డీఎస్హెచ్-1, డీఆర్ఎస్హెచ్-1, ఏపీఎస్హెచ్-66 రకాలు అనువైనవి. నవంబర్లో విత్తిన పైరుకు విత్తిన తేదీని బట్టి 30-35 రోజుల్లో హెక్టారుకు 40 కిలోల నత్రజని ఎరువులు వేయాలి.
కుసుమ : ఈ పంట విత్తిన 40-45 రోజుల వరకు పేను తాకిడి చాలా ప్రమాదకరమైంది. దీని నివారణకు లీటర్ నీటికి డై మిథోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పంట వేసిన 20 రోజుల నుంచి పూత దశ వరకు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారంలో రెండు సార్లు పిచికారీ చేయాలి.