నల్లగొండ, డిసెంబర్ 14 : అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యమిస్తున్నది. ప్రతి సంవత్సరం మాదిరిగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్లకు గిఫ్ట్ప్యాక్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఉమ్మడి జిల్లాకు 12 వేల కానుకలు వచ్చాయి. వాటిని తాసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరచగా ఈ నెల 25 లోపు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారు. పండుగకు ముందు క్రిస్టియన్లకు విందు భోజనాలు సైతం సర్కారు ఏర్పాటు చేస్తున్నది.
అన్ని వర్గాల ప్రజలు పండుగలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దుస్తులు అందిస్తున్నారు. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రంజాన్కు తోఫా, క్రిస్మస్కు గిఫ్ట్లను పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా గిఫ్టులు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నది. నియోజక వర్గానికి వెయ్యి చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 12 వేల గిఫ్టులను సర్కారు పంపించింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని తాసీల్దార్ కార్యాలయాల్లో వీటిని భద్ర పరిచారు.
పేద క్రైస్తవుల గుర్తింపు
ఈ నెల 25 లోపు క్రిస్మస్ గిఫ్ట్లను అర్హులకు అందించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయా చర్చిల పాస్టర్లు గుర్తించిన పేద క్రైస్తవులకు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా దుస్తులు పంపిణీ చేయనున్నారు. అన్ని మండలాల్లో గుర్తించిన పేద క్రైస్తవులకు నియోజకవర్గ కేంద్రాల్లో భోజనం పెట్టి మరీ గిఫ్టులను అందజేయనున్నారు. ప్రభుత్వం అందించే గిఫ్ట్లో చీరతో పాటు ప్యాంట్, షర్ట్, పంజాబీ డ్రెస్ ఉంది. అంటే ఇంట్లో తల్లి దండ్రులతో పాటు కూతురిని దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ప్యాక్ను ప్రభుత్వం అందిస్తున్నది. దాంతో క్రైస్తవుల ఇండ్లల్లో ఆనందం నిండనుంది.
నియోజక వర్గానికి వెయ్యి గిఫ్ట్లు వచ్చాయి
ఈ నెల 25న క్రిస్మస్ పండుగు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గానికి వెయ్యి చొప్పున క్రిస్మస్ కానుకలను పంపించింది. ఆయా మండలాల్లో తాసీల్దార్ల ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో చర్చిల పాస్టర్ల ద్వారా పేద క్రైస్తవులను గుర్తించి ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన గిఫ్టులను ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని తాసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరిచాం.
–జయచంద్రారెడ్డి, ఆర్డీఓ, నల్లగొండ