యాదాద్రి, డిసెంబర్ 14 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టి నిజాభిషేకం చేశారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 12వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.16,06,866 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రిలో హెలికాప్టర్కు ప్రత్యేక పూజలు
యాదాద్రిలో హెలికాప్టర్కు బుధవారం ప్రత్యేక పూజలు చేసి సర్వీసును ప్రారంభించారు. ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస్రావు హైదరాబాద్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున కొనుగోలు చేసిన హెలికాప్టర్కు టెంపుల్ సిటీలోని హెలిప్యాడ్ వద్ద శివాలయ ప్రధాన పురోహితులు, అర్చకులు వాహన పూజలు చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావుతో కలిసి ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస్రావు కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్టలో పూజలు చేసి హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు పైలట్ కెప్టెన్ దీపక్ కులకర్ణి తెలిపారు. అంతకుముందు వారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఏఈఓ రఘు, సూపరింటెండెంట్ ఊడేపు రాజు, రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకర్రావు, ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య, వైటీడీఏ ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.