నాంపల్లి, డిసెంబర్ 14 : దశాబ్దాల కాలంగా రోడ్డు కోసం నిరీక్షించారు. తండాలకు వచ్చిన ప్రతి ఆధికారి, ప్రజా ప్రతినిధికి రోడ్డు గురించి విన్నవించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు తమ గోడును వెల్లబోసుకున్నారు. సమైక్య పాలకులు పట్టించుకున్న పాపనపోలేదు. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత వారి కష్టాలను దూరం చేసేందుకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండలం జాన్తండాలో 180, నామానాయక్తండాలో 252 కుటుంబాలు నివాసం ఉంటాయి. గతంలో నామానాయక్తండా, జాన్తండా పస్నూర్ పంచాయతీలో ఆవాస గ్రామాలుగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో రెండు తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. ఆయా తండాలకు గతంలో ఎప్పుడో కంకర, మట్టి రోడ్డు వేశారు. మట్టి కొట్టుకుపోయి కంకర తేలి రోడ్డు గుంతలమయంగా మారింది. కనీసం ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ గిట్టుబాటు కాదని వెనుకడుగు వేశాడు. తిరిగి ఇటీవల రోడ్డు నిర్మాణానికి నిధులు పెంచి టెండర్లు పిలిచింది. నామానాయక్తండాకు 2.50 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.37 కోట్లు, జాన్తండాకు 2 కిలోమీటర్ల రోడ్డుకు రూ 1.25 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు పూర్తయ్యాయి. అగ్రిమెంట్ పూర్తి కావడంతో త్వరలో పనులు పూర్తి కానున్నాయి.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ఎన్నో ఏండ్లుగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సహకరించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి రుణపడి ఉంటాం. మా తండా నుంచి నాంపల్లి, చండూరుకు వెళ్లాలంటే ఇబ్బందులు పడే వాళ్లం. అత్యవసర సమయాల్లో 108 వాహనం కూడా తండాకు రాకపోయేది. ఇప్పుడు రోడ్డు వేస్తే ఎక్కడకైనా వెళ్లాలన్న సులువుగా పోతాం.
–సపావత్ కేస్లీ, జాన్తండా సర్పంచ్