నేడు రైతు ప్రదర్శన, బహిరంగసభ
నల్లగొండ ప్రతినిధి, నవంబర్26(నమస్తే తెలంగాణ) : నల్లగొండలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు సీపీఎం అనుబంధ తెలంగాణ రైతుసంఘం మహాసభలు జరుగనున్నాయి. మహాసభకు రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల నుంచి 800 మంది రైతు ప్రతినిధులు హాజరుకానుండగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాసభ తొలిరోజు నల్లగొండలో భారీ రైతు ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో జాతీయ నాయకులు పాల్గొననున్నారు.
ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర రెండో మహాసభలకు నల్లగొండలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతో పాటు ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహాసభల్లో ఆదివారం రైతు ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు పలు జిల్లాల నుంచి రైతులు ప్రదర్శనలో పాల్గొనేలా చూస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఎఫ్సీఐ రోడ్డు నుంచి ప్రారంభమై బీటీఎస్, ప్రకాశం బజార్, క్లాక్టవర్ మీదుగా ఎన్జీ కాలేజీ మైదానానికి ర్యాలీ చేరుకోనున్నది. కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రైతుసంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అశోక్ రావలే, హన్నన్మొల్లాతో పాటు రాష్ట్ర నేతలు సారంపల్లి మల్లారెడ్డి, టి. సాగర్, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి మాట్లాడనున్నారు. రెండో రోజు సోమవారం నల్లగొండలోని ఏచూరి గార్డెన్స్లో ప్రతినిధుల సభ ప్రారంభం కానున్నది. మహాసభ జరిగే ప్రాంతానికి మల్లు స్వరాజ్యం నగర్గా నామకరణం చేశారు. మూడోరోజు మహాసభల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. చివరల్లో రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన జూలకంటి
నీలగిరి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను శనివారం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తొలిరోజు రైతు ప్రదర్శన, 30 వేల మందితో భారీ బహిరంగ సభ, మిగతా రెండు రోజుల పాటు ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రైతు సమస్యలపై చర్చించి, పలు తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, సయ్యద్ హాషం, నారి అయిలయ్య, పాలడుగు నాగార్జున, ప్రభావతి, ఎండీ. సలీం, దండెంపల్లి సత్తయ్య, నన్నూరి వెంకటరమణారెడ్డి, తుమ్మల పద్మ, మల్లం మహేశ్, నలపరాజు సైదులు, కుంభం కృష్ణారెడ్డి, ఊట్కూరి మధుసూదన్రెడ్డి, ఖమ్మంపాటి శంకర్, అద్దంకి నర్సింహ ఉన్నారు.