బొడ్రాయిబజార్, జనవరి 26 : ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రధాని మోదీ దేశ సంపదను లూటీ చేస్తున్నాడని ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని చండ్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘాల రాష్ట్ర రెండో మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఫార్మా, భవన నిర్మాణం, ఐటీ రంగాల్లో కార్మికుల సంఖ్య పెరుగుతుందన్రారు. భవన నిర్మాణ కార్మికులకు పని భద్రత, ఆదాయం సక్రమంగా లేదన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. దేశంలో 364 ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ దేశ సంపదను వారికి ధారదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్మాణ రంగ వస్తువుల రేట్లు పెంచడంతో సంక్షోభంలో కూరుకుపోయిందని, దాంతో భవన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన భవన కార్మికులకు రూ. 6లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బీమా అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ జెండాను ఎగురవే శారు. గోపాలరావు, జెల్లా మురళి, దేశోజు మధు అధ్యక్షతన జరిగిన మహాసభలో రాష్ట్ర కోశాధికారి గంట నాగయ్య, జిల్లా అధ్యక్షుడు కామళ్ల నవీన్, రాష్ట్ర నాయకులు వెంకన్న, మురళీ, బొడ్డు శంకర్, సైదులు, పోలెబోయిన కిరణ, లక్ష్మయ్య, జబ్బార్, సురేందర్, తిరుపతి పాల్గొన్నారు.