నేరేడుచర్ల, నవంబర్ 24 : బాలికల భద్రతకు భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేధింపులు, లైంగికదాడులు, ఇతర సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధపరిచేందుకు పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్లు ఏర్పాటు చేసింది. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయిని, ప్రతి తరగతి నుంచి ఇద్దరు చురుకైన విద్యార్థినులు, షీటీమ్ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. విద్య, పోలీస్ శాఖల సమన్వంతో ఇవి పని చేస్తున్నాయి. తమపై జరిగే దాడులపై ఫిర్యాదు చేసేందుకు పాఠశాలల్లో 100, 1088, 181 వంటి టోల్ఫ్రీ నంబర్లను ప్రదర్శించారు.
ఫిబ్రవరి వరకు కార్యక్రమాలు
బాలికా సాధికారత కమిటీల ఆధ్వర్యంలో అక్టోబర్ 21 నుంచి 2023 ఫిబ్రవరి 10 వరకు ప్రభుత్వం సూచించిన విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కమిటీల ద్వారా ఎదుగుదలతోపాటు వచ్చే అరోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, జీవన నైపుణ్యంపై ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో డాక్టర్లతో ఈ నెల 11న అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాలికల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సహచరుల ఒత్తిళ్లకు ‘ నో’ చెప్పడం, తదితరాలపై డిసెంబర్ 9న నేర్పిస్తారు. జనవరి 8న శిశు సంక్షేమ శాఖ ప్రతినిధితో ఓరియంటేషన్, లైంగికదాడులు అడ్డుకోవడంపై అవగాహన సదస్సులు, జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం నిర్వహిచనున్నారు. అదే రోజు బాల్య వివాహాలు, హింస, తదితర సమస్యలపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 10న చివరి రోజు పాఠశాలలో చేసిన కార్యక్రమాలపై చర్చిస్తారు.
మంచి అవగాహన కల్పిస్తున్నారు
మా పాఠశాలలో బాలికల సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. బాలికలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కమిటీల ద్వారా మాకు ఎంతో ఉపయోగం ఉంది. బాల్యంలో అప్రమత్తంగా ఉండే విధానంపై కొంత అవగాహన వస్తుంది. సమాజం తీరు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
– ఎం.అమృత, 9వ తరగతి, నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్
బాలికల్లో మనోధైర్యం కల్పించడమే క్లబ్ లక్ష్యం
పాఠశాలల్లో చదివే విద్యార్థినుల్లో మనోధైర్యం కల్పించడానికే ప్రభుత్వం సాధికారత క్లబ్లు ఏర్పాటు చేసింది. తరగతి గది నుంచి ఇద్దరు బాలికలను సభ్యులుగా చేయడంతోపాటు ఉపాధ్యాయురాలు కన్వీనర్గా, పాఠశాల హెచ్ఎం చైర్మన్గా ఉన్నారు. ఈ కమిటీ ద్వారా సమాజంలో జరుగుతున్న విషయాలపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం.
– పి.కళ్యాణి, సాధికారత కమిటీ కన్వీనర్,నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్
బాలికలను గౌరవించాలి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పాఠశాలల్లో బాలికా సాధికారత కమిటీలు వేశాం. బాలికల సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిటీలు ఎంతో దోహదపడుతాయి. కమిటీలో ఉన్న బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. బాలికలను సమాజంలో గౌరవించాలి. ఆడపిల్లలను గౌరవించాలని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మగ పిల్లలకు నేర్పించాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. పాఠశాలలో కచ్చితంగా ఆ దిశగా మేం ప్రయత్నిస్తూనే ఉంటాం.
– ఎల్.శ్రీనివాస్, సాధికారత కమిటీ చైర్మన్, నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపాల్