మిర్యాలగూడ, నవంబర్ 24 : నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఈదులగూడ వద్ద వన్టౌన్ ఎస్ఐ సుధీర్కుమార్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడకు రెండు బైక్లపై వస్తున్న నలుగురిని ఆపేందుకు యత్నించగా వారు ఆపకుండా వేగంగా వెళ్లి పోయారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలేనికి చెందిన సట్టి అశోక్, కోదాడ పట్టణానికి చెందిన నాగదాసరి వనిసిమిరెడ్డి, దీగుంట్ల ఉపేందర్, మునగంటి గోపిగా తేలింది. తాము మరో ఇద్దరితో కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకొన్నారు. తాము దొంగిలించిన నగలను మిర్యాలగూడలో విక్రయించేందుకు వస్తున్నట్లు విచారణలో తెలిపారు. వీరంతా మిర్యాలగూడ పట్టణం, వేములపల్లి, చిలుకూరు పోలీస్స్టేషన్ల పరిధిలో ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పి తెలిపారు.
జైల్లోనే ముఠాగా ఏర్పడి
నిందితులు గతంలో వేరువేరుగా నేరాలు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. హుజూర్నగర్ జైల్లో ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని ముఠాగా ఏర్పడ్డారు. విడుదలైన తర్వాత జట్టుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వీరంతా జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగటి వేళల్లో బైక్లపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి, రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడేవారు. వీరిపై మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలో 4, వేములపల్లి, చిలుకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.6 లక్షల విలువైన 72 గ్రాముల బంగారం, 1100 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరిధిలో 1, చిలుకూరు పరిదిలో 1 కేసు నమోదు అయినట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకొని కేసును ఛేదించిన సీఐ రాఘవేందర్, ఎస్ఐలు సుధీర్కుమార్, నర్సింహులు, కృష్ణయ్య, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.