ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ, నవంబర్ 24 : మురుగు నీటిని శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆదేశించారు. గురువారం పట్టణం శివారులో నిర్మిస్తున్న ఎస్టీపీ కేంద్రం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో భాగంగా రూ.3.30 కోట్లతో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రం పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ప్రభుత్వం మున్సిపాల్టీల అభివృద్ధికి ప్రతి నెలా నిధులు అందిస్తున్నదన్నారు. దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు, ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, కమిషనర్ వెంకటయ్య, ఏఈ రాజు, వడ్త్య దేవేందర్, సైదులు, రైస్, జయప్రకాశ్నారాయణ, తౌఫిక్ఖాద్రి, అశోక్, లింగయ్య పాల్గొన్నారు.
యాదగిరికి నివాళి
పట్టణానికి చెందిన సముద్రాల యాదగిరి గురువారం మృతి చెందగా ఎమ్మెల్యే నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
లింగన్నబావి గ్రామస్తుల వినతి
గొట్టిముక్కల రిజర్వాయర్లో ముంపునకు గురైన లింగన్నబావి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. గతంలో చింతపల్లి మండలం సమీపంలో 110 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించిందని, ఆయా స్థలాల్లోనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కంబాలపల్లి ఆనంద్, గ్రామస్తులు గుద్దేటి జగపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు.