చిట్యాల, నవంబర్ 22 : నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధ్దికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.40 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేయించి గ్రామాలను సస్యశ్యామలం చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. చిట్యాల మున్సిపాలిటీలో రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు. మూడున్నరేండ్లుగా నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని మళ్లీ కొందరు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకి ధనమ్మాయాదగిరి, తాసీల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
నార్కట్పల్లి : ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పలు వార్డులు కలియ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించారు. విడుతల వారీగా నార్కట్పల్లిని మోడల్ పట్టణంగా తీర్చి దిద్దుతానని పేర్కొన్నారు. అనంతరం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ గీతాలాపన శత దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను నిర్వాహణ కమిటీ సభ్యులతో ఆవిష్కరించారు.
పలు కుటుంబాలకు పరామర్శ..
మండలంలోని అక్కెనపల్లి గ్రామానికి చెందిన కడారి గట్టు, మర్రి లింగయ్య, చిప్పలపల్లి గ్రామానికి చెందిన పాటి మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధితులకు ఆర్థిక సా యం అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి ఉన్నారు.