యాదాద్రి, నవంబర్ 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్య క్షేత్రంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో మంగళవారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొన్నది. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ముందుగా 108 వెండి కలశాలకు పూజలు జరిపారు. పంచసూక్త పఠనతో హోమం చేపట్టారు. ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చనలు జరిపారు. తెల్లవారుజాము 4 నుంచి ఐదున్నర గంటల వరకు గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
నారసింహుడికి నిత్యారాధనలు..
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంతో స్వయంభూ నారసింహుడికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తికమాసం చివరి మంగళవారం కావడంతో కార్తిక ఆరాధనలు వైభవంగా సాగాయి. కొండకింద సత్యనారాయణ స్వామి వ్రతాల్లో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. తెల్లవారుజామునుంచే మహిళలు కార్తిక దీపారాధన పూజల్లో పాల్గొని దీపాలు వెలిగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్, శివాలయం చెంత గల క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.51,00,186 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామివారికి వెండి సామగ్రి బహూకరణ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి పలువురు భక్తులు మంగళవారం వెండి సామగ్రిని బహూకరించారు. హైదరాబాద్లోని గోషామహల్కు చెందిన పి.గోపాల్, చంద్రకళ దంపతులు 950 గ్రాముల వెండి స్తంబాలం, ఆదిభట్లకు చెందిన బూడిద మహిపాల్రెడ్డి 3 వెండి కళశాలను ఆలయ ఏఈఓ రఘుబాబు, సూపరింటెండెంట్ సురేందర్రెడ్డికి అందించారు.
కార్తిక వనభోజనాలు…
దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తిక వనభోజనం కమనీయంగా సాగింది. మల్లాపురం గ్రామ పరిధిలోని ఆలయ తోటలో మొదటగా గణపతిపూజ, స్వస్తీవాచనం, మండప ఆరాధన, సత్యనారాయణస్వామి పూజ, తులసీధాత్రి సమేత కార్తిక దామోదరస్వామివారి కల్యాణోత్సవం జరిపారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ, ఈఈ ఊడేపు రామారావు, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్, రఘు, ఆలయ ఇంజినీర్ మహిపాల్రెడ్డి, దయాకర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.