యాదాద్రి, నవంబర్ 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో కార్తిక సందడి నెలకొన్నది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో స్వయంభూ ఆలయం, అనుబంధ రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే భక్తులు దీపారాధన, వ్రతాలు నిర్వహించారు. భక్తులతో ఆలయ మాఢవీధులు, వ్రత మండపాలు, రామలింగేశ్వర స్వామి ఆలయం, క్యూలైన్లలో సందడి నెలకొన్నది.
కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. 1,157 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. రామలింగేశ్వర కుటుంబంతోపాటు ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నరపాటు జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడిని శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. ఉదయం 3.30 గంటలకు స్వయంభూ నారసింహుడి ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవలో స్వామివారిని మెల్కొలిపారు.
తిరువారాధన జరిపి స్వామి, అమ్మవార్లకు బాలభోగం జరిపారు. స్వయంభూ నారసింహుడికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభీష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చీ వాహనాలపై వేంచేపు చేసి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. రాత్రి దర్బార్ సేవ, నివేదన, శయనోత్సవం జరిపారు. పాతగుట్ట ఆలయంలో కార్తిక వేడుకలు వైభవంగా నిర్వహించారు. సుమారు 26 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి ఖజానాకు రూ.32,38,570 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
మిర్యాలగూడ మండలం ఆలగడపకు చెందిన శ్రీదత్త ఏకోనారాయణ పరబ్రహ్మ పీఠానికి చెందిన రమేశ్ స్వామి రాయగిరి నుంచి పొర్లు దండాలతో యాదాద్రి ఆలయ వైకుంఠ ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్వగ్రామంలో శ్రీదత్త ఆశ్రమాన్ని నిర్మించేందుకు దాతలు ముందుకురావాలని, అందుకు స్వామివారి అనుగ్రహం కోరుతూ ఈ నెల 16న స్వగ్రామం నుంచి పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
యాదాద్రి ఆలయం ఆధ్వర్యంలో మంగళవారం కార్తిక వన భోజనాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని మల్లాపురం శివారులోని గోశాల వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు, అనంతరం ఆలయ సిబ్బంది, పాత్రికేయులకు వన భోజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
స్వామివారిని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం కుటుంబసమేతంగా యాదాద్రికి చేరుకుని పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని, అనంతరం ప్రధానాలయంలోని స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 2,942,250
వీఐపీ దర్శనాలు 75,000
బ్రేక్ దర్శనం 83,700
వేద ఆశీర్వచనం 18,000
నిత్య కైంకర్యాలు 1,600
సుప్రభాతం 6,600
ప్రచార శాఖ 43,960
వ్రత పూజలు 9,26,200
కల్యాణకట్ట టిక్కెట్లు 1,05,000
ప్రసాద విక్రయం 10,69,600
వాహన పూజలు 22,000
అన్నదాన విరాళం 19,401
సువర్ణ పుష్పార్చన 79,560
యాదరుషి నిలయం 73,740
పాతగుట్ట నుంచి 1,09,130
కొండపైకి వాహన ప్రవేశం 2,75,000
శివాలయం 22,900
ఇతర విభాగాలు 14,929