జిల్లాలో ఈ ఏడాది రుణలక్ష్యం రూ.127 కోట్లు.. తీసుకున్నది రూ.41 కోట్లుకొనసాగుతున్న ప్రక్రియమహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సర్కారు ఇస్తున్న స్త్రీ నిధి రుణాలు వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రతి మహిళా స్వశక్తితో ఎదిగేలా ఊతమిస్తున్నాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేలా చేస్తున్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. జిల్లాలో 19,154 పొదుపు సంఘాలు ఉండగా 11,890 సంఘాల్లోని 75,953 మంది రుణాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం రూ.127కోట్ల రుణాలు ఇచ్చేందుకు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు సుమారు రూ. 41కోట్ల రుణాలు ఇచ్చారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో స్త్రీ నిధి రుణాలు అందజేస్తున్నారు. జిల్లా వ్యా ప్తంగా 19,154 పొదుపు సంఘాలు ఉండ గా.. వీటిలో 1,93,090 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 11,890 సంఘాల్లో 75,953 మంది రుణం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రూ.127 కోట్ల రుణ లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటి వరకు సుమారు రూ.41 కోట్ల మేర రుణాలు ఇచ్చారు. అయితే 11 శాతం(92 పైసలు) తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. రుణం పొందే సమయంలో ఎలాంటి పేపర్, ప్రింటింగ్, డాక్యుమెంటేషన్ ఖర్చు లేకుండా రుణాన్ని అందిస్తున్నారు. దరఖాస్తు చేసుకుంటే స్త్రీ నిధి సిబ్బంది సదరు గ్రామానికి వెళ్లి రుణాలు అందిస్తున్నారు. మూడు రకాల రుణాలు అందిస్తున్నారు. ప్రగతి రుణం రూ.5 నుంచి 40 వేల వరకు ఇస్తుండగా, దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే రుణ సాయం అందుతున్నది. అక్షయ రుణాలు రూ.41వేల నుంచి రూ. 1.25 లక్షల వరకు 15 రోజుల్లో ఇస్తున్నారు. సౌభాగ్య రుణం రూ.1.26 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు 15 నుంచి 20 రోజుల్లో ఇస్తున్నారు.
స్త్రీ నిధి రుణాలతో మహిళలు ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందుతున్నారు. వివిధ రంగాల్లో చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తున్నారు. వందల రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుని స్వ శక్తితో ముందుకెళ్తున్నారు. కిరాణా షాపు, ఫ్యాన్సీ దుకాణాలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ప్లేట్ల తయారీ, జిరాక్స్ సెంటర్, జనరల్ మెడికల్ షాపు తదితర చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఇలా నెలకు రూ.10 నుంచి రూ. 20వేల వరకు ఆదాయం పొందుతూ ఆర్థికంగా మెరుగుపడుతున్నారు. అంతేకాకుండా పలు చోట్ల వారు పనిచేస్తూనే మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
సర్కారు సహకారంతో రుణాలు పొందుతున్న కొన్ని సంఘాల సభ్యులు తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాంతో అనుకున్న లక్ష్యం చేరడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొండి బకాయిలపై స్త్రీనిధి, సెర్ప్ ప్రత్యేక దృష్టి సారించాయి. గ్రామాలకు వెళ్లి సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాయి. రుణం చెల్లించకుంటే జరిగే నష్టాన్ని వివరిస్తున్నాయి. జిల్లాలో 3,257 సంఘాలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు మరికొందరు మహిళలు సకాలంలో చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్త్రీ నిధి పథకంలో రుణం తీసుకున్న మహిళలకు ప్రభుత్వం చిన్న మొత్తంలో డబ్బులు తీసుకుని బీమా కూడా కల్పిస్తున్నది. రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తు మరణిస్తే పథకం కింద తీసుకున్న రుణం మాఫీ అవు తుంది. అంతేకాకుండా ఎన్ని కిస్తీలు కట్టారో అంత మొత్తం కూడా తిరిగి ఆమె కుటుంబానికి చెల్లిస్తారు. ఇలా పలు విధాలుగా సర్కారు ఆదుకుంటున్నది.
స్త్రీనిధి ద్వారా మొదటిసారిగా రూ.50 వేల రుణం తీసుకున్న. అవి చెల్లించడంతో రూ.75 వేల రుణం ఇచ్చారు. కిరాణం పెట్టుకోవడంతో ప్రతి నెలా రూ.10వేలకు పైగా ఆదాయం వస్తున్నది. ప్రభుత్వంలోని ఇలాంటి రుణాలు మంజూరైన మాకు ఎంతో సంతోషంగా ఉంది.
– భాగ్యమ్మ, రేణుకా గ్రూప్
స్త్రీ నిధి నుంచి రూ.75 వేలు రుణం తీసుకొని ఆయిల్ మిల్లు ఏర్పాటు చేశాను. దాంతో రోజు పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. నెలకు రూ. 10 వేల ఆదాయం వస్తున్నది. కుటుంబానికి కూడా ఆసరా అవుతున్నది. రుణం డబ్బులు ప్రతి నెలా రెండు వేలు ఠంఛనుగా చెల్లిస్తున్నాను. ఉపాధి కోసం ఆదుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– రామసాని మౌనిక, కనకదుర్గ సంఘం, భూదాన్ పోచంపల్లి
రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో బతకలేకపోతున్నం. కుటుంబ సభ్యులు పనిచేస్తేగానీ ఇల్లు గడవడం కష్టం. రుణం డబ్బులతో వాటర్ ప్లాంట్ ఏ ర్పాటు చేశాం. ఇక్కడే పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్న. స్త్రీ నిధి రుణంతో మా బతుకుదెరువుకు బాసటగా నిలుస్తున్నది.
– కట్కూరి స్వాతి, మౌనిక సంఘం, భూదాన్ పోచంపల్లి
సమాజంలో నాకంటూ ఓ గుర్తింపు వచ్చిందంటే అది మహిళా సంఘం సభ్యురాలినైనందుకే. సంఘంలో
చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు రుణ సాయంతో ఎన్నో ఆర్థిక అవసరాలను తీర్చుకోగలిగాను. గ్రామంలో
చిన్నపాటి కిరాణా డబ్బా ఏర్పాటు చేసుకున్న. అంచెలంచెలుగా రుణ సాయాన్ని పెంచుకుని స్వతహాగా
షాపును నడిపిస్తున్నా. మహిళా సంఘం సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. షాపులో
విక్రయాలు బాగానే జరుగుతుండటంతో సంఘంలో తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తున్నాం.
– మచ్చ పద్మ, వీరశివాజీ సమభావన సంఘం, అనంతారం, భువనగిరి