సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో వచ్చిన మెడికల్ కళాశాల ప్రజలకు వరంగా మారింది. ప్రసవాల్లో రాష్ట్రంలోనే టాప్లో నిలువగా ఆపరేషన్లు లేకుండా సాధారణ ప్రసవాల్లో రాష్ట్రంలోనే సూర్యాపేట జనరల్ ఆస్పత్రి టాప్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పేషెంట్లు ఇక్కడకు వచ్చి చికిత్స పొందారు. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో 24 గంటలపాటు అందుతున్నాయి.
ఇప్పటి వరకు సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో 300 పడకల జనరల్ ఆస్పత్రిగా మార్చి వైద్య సేవలు అందిస్తుండగా ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ 30 పడకలతో సేవలు అందుతున్నాయి. వీటితోపాటు 24 గంటలపాటు ఇక్కడ అత్యాధునిక ల్యాబుల్లో అన్ని రకాల పరీక్షలు, సీటీ స్కాన్ సౌకర్యం ఉంది. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. డాక్టర్లు, స్టాఫ్నర్సులు, నర్సులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుండడంతో వైద్య సేవలు అదే స్థాయిలో అందుతున్నాయి. మెడికల్ కళాశాల ప్రారంభమైన నాటి నుంచి అన్ని విభాగాల్లో వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
త్వరలో మోకాలి చిప్పల శస్త్ర చికిత్సలు
సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో ఇప్పటికే అనేక రకాల వైద్య సేవలు అందుతుండగా త్వరలోనే అరిగిపోయిన మోకాలి చిప్పల ఆపరేషన్లు చేయనున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆపరేషన్ స్టాండర్డ్స్తో ఆపరేషన్లు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఇప్పటికే ఉండగా, మోకాలి చిప్పల మార్పిడి కోసం జాయింట్ ఇంప్లేట్స్, ఇతర పరికరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అలాగే 10 బెడ్స్తో వార్డును కూడా సిద్ధం చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. మోకాలి ఆపరేషన్ చేయించుకోవాలంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కనీసం రూ.2లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు కానుండగా, ఇక్కడ మాత్రం పూర్తి ఉచితంగానే సేవలు అందనున్నాయి. కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ల కోసం పూర్తి ఏర్పాట్లు చేసి మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిసిందితెలిసింది.
సూర్యాపేటలో మోకాలి మార్పిడి చికిత్సలు సంతోషకరమంటున్న నర్సింహారెడ్డి
సూర్యాపేట పట్టణానికి చెందిన నర్సింహారెడ్డికి నాలుగేండ్ల క్రితం మోకాళ్ల నొప్పులు స్టార్ట్ అయ్యాయి. దాంతో స్థానిక ఆర్థోపెడిక్ డాక్టర్లను సంప్రదించగా మోకాళ్లు అరుగుతున్నాయని చెప్పగా మందులు వాడుతూ వచ్చాడు. గత ఏడాది కాలంగా నొప్పులు అధికం కావడంతో మోకాలి చిప్పలు మార్చాలని డాక్టర్ సూచించారు. అయితే సూర్యాపేటలో ఆపరేషన్ సదుపాయం లేకపోవడంతో నరసింహారెడ్డి హైదరాబాద్కు వెళ్లి ఓ ప్రైవేట్ దవాఖానలో రెండు మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకోగా దాదాపు రూ.2.50 లక్షలు ఖర్చయ్యాయి. ప్రస్తుతం మోకాలి నొప్పులు లేకుండా అవలీలగా నడుస్తున్నట్లు నరసింహారెడ్డి తెలిపారు. కాగా, త్వరలో సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయబోతున్నట్లు తెలిసిందని, ఇది నిజంగా సంతోషించదగ్గ విషయమన్నారు. పేద, మధ్యతరగతి వారికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
ఏర్పాట్లు పూర్తికావచ్చాయి
సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో మోకాలి చిప్పల మార్పిడి శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల రోజుల్లోపే ఆపరేషన్లు చేసేందుకు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ తరహాలో వసతులు కల్పిస్తున్నాం. మోకాలి చిప్పల మార్పిడి కోసం జాయింట్ ఇంప్లేట్స్ సిద్ధం కాగా, ఇతర సౌకర్యాలు త్వరలోనే పూర్తికానున్నాయి. ఈ ఆపరేషన్లు ప్రారంభమైతే పేద, మధ్యతరగతి ప్రజలకు ఇదొక వరంగా చెప్పవచ్చు.
-డాక్టర్ దండ మురళీధర్రెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి