ఆత్మకూరు(ఎం), నవంబర్17 : ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఎంపికైన యువకులకు ఆర్మీ, పోలీస్ అసోసియేషన్ సహకారంతో నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఆత్మకూరు(ఎం)లోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పాల్గొంటూ ఈవెంట్స్ ఎంపిక కోసం అభ్యర్థులు ముమ్మర సాధన చేస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన 35 మంది యువకులు పోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమ్స్లో ఎంపికయ్యారు.
ఈవెంట్స్కు ఎంపికైన 35 మంది అభ్యర్థులకు గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగులు పారుపల్లి ప్రణయ్, గడ్డం సాయిరాం, చెరుకు వెంకటేశ్, పోలీస్ కానిస్టేబుల్ తవిటి మత్స్యగిరి, మేకపోతుల స్వామి, మల్లం రమేశ్, పరకాల శ్రీశైలం, లెనిన్, వెంకన్న, నరేశ్, సతీశ్ సెలవులు పెట్టి గ్రామంలోని యువకుల కోసం శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో గ్రామానికి చెందిన ముప్పై మంది యువకులు, ఐదుగురు యువతులు ప్రిలిమ్స్లో ఎంపికై ఈవెంట్స్ కోసం సాధన చేస్తున్నారు. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తామనే ధీమాతో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని జాబ్ కొట్టాలనే కసితో ముమ్మర సాధన చేస్తున్నారు.
ప్రిలిమ్స్లో ఎంపికైన నేను తప్పనిసరిగా ఈవెంట్స్లో కూడా ఎంపికై పోలీస్ ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. రోజూ 3 గంటలపాటు సాధన చేస్తున్నా. ఆర్మీ, పోలీస్ ఉద్యోగులు మంచి శిక్షణ ఇస్తున్నారు.
-పైళ్ల రమేశ్, ఆత్మకూరు(ఎం)
గ్రామంలోని తోటి యువకులంతా ఎస్ఐ, పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి సెలవులు పెట్టి వచ్చాను. శిక్షణలో భాగంగా యువకులకు అనేక మెళకువలు నేర్పుతున్నాం.
-పారుపల్లి ప్రణయ్, ఆర్మీ ఉద్యోగి, ఆత్మకూరు(ఎం)
ప్రిలిమ్స్లో ఎంపికైన యువకులంతా ఈవెంట్స్లో ఎంపికై పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉచిత శిక్షణ ఏర్పాటు చేశాం. గ్రామానికి చెందిన ఆర్మీ, పోలీస్ అసోసియేషన్ సహకారంతో ఈ శిక్షణ కొనసాగుతుంది.
– శంతన్రాజు, నేతాజీ యువజన మండలి అధ్యక్షుడు