నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ) : నుడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు పాలకవర్గం అడుగులు వేస్తుంది. అందుకోసం ఓ వైపు ప్రభుత్వ నిధులతో పాటు సొంతంగా కూడా నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు షురూ చేసింది. ఇతర అథారిటీల మాదిరిగానే నుడా కూడా నిధుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. తొలి దశలో నార్కట్పల్లి-అద్దంకి రహదారికి ఆనుకొని ఉన్న అన్నెపర్తి పోలీసు బెటాలియన్ పరిసర ప్రాంతాలపై దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా కనీసం 50 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. నూడా చైర్మన్గా వ్యవహారిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కొద్ది రోజులుగా రెవెన్యూ అధికారులతో దీనిపై చర్చించారు. రెవెన్యూ అధికారుల నివేదిక ప్రకారం తొలి వెంచర్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మంచి మార్కెటింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నది. దీంతో ప్లాట్లను మంచి రేట్లతో వేలంలో విక్రయించడం సులువవుతుందని భావిస్తున్నారు. తొలిదశలో విజయవంతమైతే మిగతా ప్రాంతాల్లోనూ వెంచర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో దీనిపై కలెక్టర్ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు ప్రైవేటు భూ యజమానులను సైతం భాగస్వామ్యం చేశారు. వెంచర్ల ఏర్పాటు, భూ సేకరణ, విధివిధానాలు, ప్రైవేటు భూములిచ్చిన వారికి జరిగే లబ్ధిపై చర్చించారు. ఈ పథకం కింద ప్రభుత్వ, పట్టాదారుల పరస్పర భాగస్వామ్యంతో అన్ని వసతులతో లేఅవుట్ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అన్ని నిబంధనలు పాటిస్తూ అత్యున్నత ప్రమాణాలతో వెంచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. రైతులే వెంచర్ ఓనర్లుగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఈ వెంచర్లో డీటీసీపీ నిబంధనల ప్రకారం విశాలమైన రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, కరెంటు, పార్క్లు తదితర వసతులు కల్పిస్తారు. మిగిలిన భూమిని రైతులు, ప్రభుత్వానికి 50 శాతం వాటా చొప్పున నిర్ణయిస్తూ వేలంలో విక్రయిస్తారు. మిగతా భూములతో పోలిస్తే రైతులకు వారి భూమి ధర కంటే ఎక్కువ రేటు లభించనుంది. దీంతో పాటు రైతులు ఎలాంటి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వమే వెంచర్ అభివృద్ధి బాధ్యతను తీసుకోనుంది. భూసేకరణ ద్వారానే కాకుండా పట్టాదారులకు ఇష్టమైతేనే భూమి ఇవ్వొచ్చని, లావుని పట్టా ఉన్నవారు కూడా పట్టాదారులుగా మారేందుకు ల్యాండ్ పూలింగ్లో అవకాశం లభించనుంది. ఈ పద్ధతిలో పట్టణ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు నుడా పరిధిలోని ఇతర ప్రాంతాల్లోనూ వెంచర్లకు అనువైన స్థలాలపైనా దశలవారీగా దృష్టి సారించనున్నారు. ఇలా వెంచర్ల ద్వారా వచ్చే ఆదాయంతో నుడా పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. నుడా ద్వారా సొంతంగా అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఆదాయం సృష్టించుకుని నిధులను సమకూర్చుకోవడం కీలకమైన అంశం. దీని ఆధారంగా నుడా పరిధిలోనూ అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. వీటితో పాటు దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు రోడ్ల వైపు భూముల లభ్యతపైనా రెవెన్యూ అధికారులు సర్వే జరుపనున్నట్లు తెలిసింది. దశలవారీగా ఈ కార్యక్రమం కొనసాగించనున్నట్లు కలెక్టర్ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు.
చకచకా అభివృద్ధి పనులు..
ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేయడంతో రహదారుల విస్తరణ, జంక్షన్ల నిర్మాణం, పార్కుల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. రహదారులతో పాటు ఐటీ టవర్, ఎన్జీ కాలేజీ నూతన భవనం నిర్మాణాల కోసం టెండర్ల ప్రక్రియ చురుకుగా సాగుతోంది. త్వరలోనే టెండర్లను పూర్తి చేసి పనులు చకచకా పూర్తి చేయాలని భావిస్తున్నారు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి సమీక్షలు చేస్తున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి మార్గదర్శనంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నుడా అధికారులతో కలిసి నిత్యం పట్టణంలో పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయిలో పనులపై దృష్టి సారించారు. ఎక్కడైనా ఆటంకాలు ఎదురైతే వెంటనే వాటిని క్లియర్ చేస్తున్నారు. గురువారం కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పార్కుల నిర్మాణంపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. చర్లపల్లి వద్ద ఎఫ్టీఎల్, దేవాదాయ భూమిలో అర్బన్ లంగ్ స్పేస్ పార్క్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. రాంనగర్ పార్క్తో పాటు రాజీవ్ పార్కులను ఆధునీకరించాలని నిర్ణయించారు. ఎస్ఎల్బీసీతో పాటు మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలంలోనూ పార్కుల ఏర్పాటుపై చర్చించారు. మిగతా పనులపైనా సమీక్షలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కలెక్టరేట్లో అభివృద్ధి పనులపై జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఆర్ఓ జగదీశ్వర్రెడ్డి, తాసీల్దార్ మందడి నాగార్జున్రెడ్డి, భూ యజమనుదారులు ఉన్నారు.