చుట్టూ పెద్ద గుట్టలు, పచ్చదనంతో కూడిన అందమైన పరిసరాలు, రాతి కట్టడాలు, అద్భుతమైన శిల్పకళాకృతులతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది మహదేవ్పూర్లోని అక్కన్న మాదన్న ఆలయం. భక్తులపాలిట కొంగుబంగారంగా, శివకేశవులు ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది. 600 ఏండ్ల నాటి ఈ గుడి ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలరారుతున్నది. వేణుగోపాలస్వామి, ఉమామహేశ్వరస్వామి, పార్వతీదేవి ఆలయాలతో ఈ గుడి కొలువై ఉన్నది.
– యాదాద్రి భువనగిరి, నవంబర్ 9(నమస్తే తెలంగాణ)
బీబీనగర్ మండలం నెమురగొమ్ముల గ్రామ పరిధిలోని మహదేవ్పూర్లో అక్కన్న మాదన్న ఆలయం కొలువై ఉన్నది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చిన తురుష్కుల పాలనలో ఆలయ ప్రాభవం తగ్గిపోయింది. మట్టిదిబ్బల మాదిరిగా మారిపోయింది. అనంతరం నిజాం రాజుల కాలంలో దీనికి తిరిగి పూర్వ వైభవం వచ్చింది. తానీషా మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్న భువనగిరి పరిసర ప్రాంతాల్లో కప్పం వసూలు చేయడానికి వచ్చేవారు. గోల్కొండ నుంచి వరంగల్ వెళ్తూ మధ్యలో మహదేవ్పూర్ వద్ద ఆగి సేదతీరేవారు.
కాలగర్భంలో కలిసిన ఆలయ ప్రాంగణంలో నిద్రించి తిరిగి వెళ్లిపోయేవారు. ఒకసారి అక్కన్న మాదన్న ఈ ప్రాంతంలో నిద్రిస్తుండగా స్వామివారు కలలో ప్రత్యక్షమయ్యారట. ఈ గుట్ట వద్ద తమ విగ్రహాలు ఉన్నాయని, వెతికి ఆలయం నిర్మించాలని చెప్పి మాయమయ్యారట. దీంతో అక్కన్న మాదన్నలు గుట్టకు సొరంగం తవ్వడంతో స్వామివార్ల విగ్రహాలు బయట పడ్డాయని చరిత్ర చెబుతున్నది. సొరంగం నుంచి విగ్రహాలు బయటకు తీశాక గుడి నిర్మాణానికి నడుంబిగించారు. అందుకే దీనికి అక్కన్న మాదన్న దేవాలయంగా పేరొచ్చింది.
ఆలయ నిర్మాణ శైలి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయమంతా రాతితోనే కట్టారు. ఆలయ ప్రవేశం నుంచి గర్భగుడి దర్శనం వరకు అడుగడుగుగా అద్భుతంగా ఉంటుంది. గర్భగుడి ముందు రంగ మండపం.. దానిపై నుంచి వెలుగు, గాలి వచ్చేలా ఖాళీగా వదలడం, మంటపం మధ్యలో గుండ్రటి ప్రదేశం ఆ కాలపు నాట్య ఆసక్తికి నిదర్శనంగా ఉన్నాయి. అయితే గుడి నిర్మాణానికి రాళ్లన్నీ పక్కనే ఉన్న బొంత గుట్ట నుంచి తీసుకొచ్చారనే ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి.
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మూడు దేవాలయాల సముదాయం చూడవచ్చు. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, ఉమామహేశ్వరుల అమ్మవార్లు కనిపిస్తారు. క్షేత్రపాలకుడు ఆంజనేయుడి ఆలయం కూడా ఇక్కడుంది. ఆలయంలో స్వామివారు కొలువై ఉన్నారనడానికి నిదర్శనాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఉదయం వేళ స్వామివారు అమ్మవారితో కలిసి బయటకు వస్తారని, ఆలయమంతా తిరిగి మళ్లీ లోపలికి వెళ్లిపోతారని పేర్కొంటున్నారు. స్వామి వారి పాదానికి ఉన్న దుమ్ము, మట్టి రేణువులే దీనికి తార్కాణమని చెబుతున్నారు.
ఈ ఆలయంలో రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం మొదటిది. గర్భగుడిలో నిలువెత్తు నల్లరాతితో చెక్కిన వేణుగోపాలస్వామి, రుక్మిణీ, సత్యభావ దేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు.
ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రసాదం తీసుకుంటే సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని చెబుతారు. కోరికలు మొక్కుకునే ముందు 11సార్లు, కోరికలు తీరాక 108సార్లు ప్రదర్శనలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.
దేవాలయంలో వేణుగోపాలస్వామికి శనివారం, ఉమామహేశ్వర ఆలయంలో సోమవారం, అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరుగుతాయి. శివరాత్రి రోజు వేణుగోపాలస్వామికి బ్రహ్మోత్సవాలు, శివ కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ఈ పండుగ రోజున దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు.
ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆలయాన్ని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని దేవుడికి మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలో కలిపారు. ప్రస్తుతం ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు, సీరియళ్లు కూడా తీస్తున్నారు. హైవేకు పక్కనే ఉండటంతో భక్తులు, పర్యాటకులు సందర్శిస్తుంటారు.
నాడు అక్కన్నమాదన్నలకు దేవుడు కలలో ప్రత్యక్షం కావడంతో గుడి నిర్మితమైంది. గర్భగుడి నిలువెత్తు విగ్రహం దివ్య తేజస్సుతో ఉంటుంది. సంతానం లేనివారు, పెళ్లికాని వారు పల్లకీ సేవలో పాల్గొంటే వెంటనే కోరికలు నెరవేరుతాయి. నిత్యం స్వామివారు ఆలయంలో తిరుగడం వల్ల కాళ్లకు ధూళి రేణులువు కనిపిస్తాయి. ఉమామహేశ్వర ఆలయం నిర్మాణం పెండింగ్లో ఉంది. దాతలు సహకరిస్తే పూర్తవుతుంది.
– శ్రుంగారం శ్రీమన్నారాయణాచార్యులు, ప్రధాన పూజారి వజీరున్నీషా బేగం
అక్కన్న, మాదన్న నిర్మించిన ఆలయం సగంలోనే ఆగిపోయిందని చరిత్ర చెబుతున్నది. అక్కన్న, మాదన్న ఇక్కడ గుడి నిర్మాణం ప్రారంభించిన సమయంలోనే వారి మేనళ్లుడు భక్త రామదాసు భద్రాచలంలో రామాలయ నిర్మాణం చేశారట. ఇందుకు ప్రభుత్వ డబ్బుల ఖర్చు చేశారని రామదాసును తానీషా కారాగారంలో బంధించారు. ఇది తెలిసిన అక్కన్న మాదన్నలు ఆలయ నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. దాంతో గుడి నిరాదరణకు గురైంది. పూజలు నిలిచిపోయాయి. జన సంచారం లేని ప్రాంతంగా మారిపోయింది. హిందూ దేవాలయాలు అంటే ఇష్టపడే వజీరున్నీషా బేగం చొరవతో గుడికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఆమెకు తన తండ్రి నుంచి వచ్చిన 33 ఎకరాల భూమిని ఆలయ కైంకర్యాల ఖర్చులు, నిర్మాణం కోసం రాసిచ్చారని తెలుస్తున్నది. అప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలు నిత్యం కొనసాగుతున్నాయి.
ఉమామహేశ్వరస్వామి ఆలయంలో అతి పురాతనమైన శివలింగం ఉన్నది. దక్షిణ భారత దేశంలో అన్ని లింగాల్లో పానబట్టం పైకి లేచి ఉంటుంది. కానీ ఈ గుడిలో పానబట్టం ఉత్తరాది ఆలయాల మాదిరి భూమికి ఆనుకుని ఉంటుంది. ఆలయంలో కూర్చుని ఉన్న గణపతి విగ్రహం ఉంటుంది. బానపొట్ట భూమికి తాకుతూ భూమికి సమాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది.