రామగిరి, ఫిబ్రవరి 10 :‘నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తూ వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం గొప్ప వరం. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు’ అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయనడంలో సందేహం లేదని నమస్తే తెలంగాణతో గురువారం ఆయన మాట్లాడుతూ స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలిచి గెలువాలంటే అంతర్జాతీయ భాష ఆంగ్లం అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరం. నేటి సాంకేతిక యుగంలో పోటీ పరీక్షలకు అవసరమైన ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సులకు సంబంధించి పుస్తకాలు ఈ-లైబ్రరీలో ఇంగ్లిష్లో అధికంగా అందుబాటులో ఉన్నాయి. మరో వైపు ఆంగ్ల మాధ్యమం అనేది సమాజంలో హోదాకు చిహ్నంగా మారిపోయింది. ఆంగ్లమాధ్యమంలో చదివితేనే మెరుగైన ఉదోగ్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే భావన కూడా వ్యాప్తిలోకి వచ్చింది. ఇది వాస్తవం కూడా. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలో భాగంగా విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు పెరుగడంతో ఆంగ్లభాష విశ్వజనీనమైన సామాజిక అవసరంగా రూపుదాల్చింది.
సంపన్న వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు చాలామంది తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివిస్తుండడంతో మిగిలిన వర్గాలు ప్రేరేపితం అవుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తి మౌలిక సదుపాయాలతో ఆంగ్లవిద్యను అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ముప్పు ఏర్పడింది. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో తెలుగు మీడియంలో ప్రభుత్వ బడిలోనే నా చదువు కొనసాగింది. ఉన్నత విద్య, ఉద్యోగ రీత్యా ఆంగ్లభాష నేర్చుకోవడం అనివార్యమైంది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మాతృభాషతోపాటు ఆంగ్లంపై పట్టు సాధించడమే కారణం. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ ఇంగ్లిష్ విద్య అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మన ఊరు.. మన బడి కార్యక్రమాన్ని తీసుకువస్తున్నారు. దాంతో విద్యార్థులు తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియం కూడా ఎంచుకునే అవకాశం ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు రూ.7,283 కోట్లు కేటాయించడం విశేషం.
ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా…
ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మూడు విడుతల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మన ఊరు-మనబడిలో తొలి విడుతలో 9,123 స్కూళ్లకు డ్యుయల్ డెస్క్ బెంచీలు, ఫర్నిచర్, డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్స్, గ్రంథాలయాలు, ఫర్నిచర్, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు నూతన గదుల నిర్మాణం, తాగునీరు, టాయిలెట్స్తోపాటు పూర్తి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామం. తెలంగాణలో నూతన విద్యా ఒరవడికి మన ఊరు.. మన బడి దర్పణం పడుతుంది.
విద్యారంగ అభివృద్ధికి గురుకులాలే నిదర్శనం
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం విద్యారంగానికి భారీగా కేటాయింపులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు అత్యంత నాణ్యమైన, గుణాత్మక విద్య అందించే గురుకులాలను ఏర్పాటు చేసింది. మన ఊరు-మన బడి కార్యక్రమం కంటే అంతకు ముందే ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఆయా పాఠశాలల్లో కార్పొరేట్ను తలదన్నేలా ఉచిత వసతి, సన్నబియ్యంతో పౌష్టికాహారం, రుచికరమైన భోజనం, నాణ్యమైన, గుణాత్మక ఆంగ్ల విద్యను అందిస్తున్నారు. దీంతో ఆ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు అన్ని వర్గాలు పోటీ పడుతున్నాయి. మాతృభాషతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడే ఆంగ్లంపై పాటు సాధించాల్సిన అవసరం ప్రాథమిక స్థాయి నుంచే కల్పించాలి.
ఉపాధ్యాయుడు అంటేనే నిత్య విద్యార్థి. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధించాల్సి ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం సైతం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి.. బడికి వెళ్లాలనే ఆలోచనను విద్యార్థుల్లో పెంపొందించాలి. పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిద్దడంతోపాటు మౌలిక వసతులైన టాయిలెట్స్, తాగునీరు, క్రీడాస్థలాలు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలి. ఇంగ్లిష్ మీడియం విజయవంతం కావాలంటే టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు మాడ్యూల్స్ అందించి సహకరించాలి. ఆంగ్ల మాధ్యమం అమలు, మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రతి రోజూ పర్యవేక్షణ కొనసాగాలి.
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి విద్యా వ్యవస్థలోనూ పెను మార్పులకు కారణమైందని చెప్పొచ్చు. డిజిటల్ పాఠాలు, ఆన్లైన్ తరగతులతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాలలు, యూనివర్సిటీ అధ్యాపకులు యాప్స్ ద్వారా బోధించడం విదితమే. సాంకేతికతను అందిపుచ్చుని విద్యార్థుల భవిష్యత్తుకై విప్లవాత్మకమైన ఒరవడితో మందుకుసాగారు. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఆంగ్లమాధ్యమం అమలు కూడా పేద విద్యార్థులకు గొప్పవరం. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది.