తిప్పర్తి, నవంబర్ 3 : రైతు సంక్షేమమే లక్ష్యం గా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నది. కాగా, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా తరలివస్తున్నది. తిప్పర్తి మండలంలో గత సీజన్లో 25 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ సీజన్లో 27 వేల ఎకరాల్లో పండించారు. ప్రస్తుతం కోతలు ప్రారంభం కావడంతో అధికారులు మండల వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత సీజన్లో 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం రాగా ప్రస్తుతం 5 లక్షల క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పా ట్లు చేశారు. కేంద్రాల్లో ఎప్పటికప్పుడు కాంటాలు వేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. మిల్లర్లు సైతం ధాన్యం దిగుమతికి సహకరించాలని సూచిస్తున్నారు.
కట్టంగూర్లో
కట్టంగూర్ : మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కట్టంగూర్, కల్మెర, మునుకుంట్ల, ఈదులూరు, దుగినవెల్లి, అయిటిపాముల, గార్లబాయిగూడెం, బొల్లే పల్లి, మల్లారం 9 పీఏసీఎస్ కేంద్రాలు. పరడ, కురుమర్తి, నారెగూడెం, చెర్వుఅన్నారం, అయిటిపాముల గ్రామాల్లో 5 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంతో కోతలు పూర్తి చేసిన అధికారులు ధాన్యాన్ని ఇప్పటికే కేంద్రాలకు తరలించారు. 5లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
తాలు, చెత్త పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు..
రైస్ మిల్లర్లు తాలు, చెత్త ఉన్నదని రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఈ సాకుతో లారీకి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు కోత విధించడం సరికాదు. అధికారులు స్పందించి రైస్ మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యం కాంటా వేసేలా చర్యలు తీసుకోవాలి
– ముత్తినేని శ్యామ్సుందర్, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్, తిప్పర్తి
వరిసాగు పెరిగింది..
గత వానకాలం సీజన్ కంటే ఈ సారి రెండు వేల ఎకరాల్లో వరిసాగు పెరిగింది. ధాన్యం దిగుబడి కూడా గతంకంటే లక్ష క్వింటాళ్ల వరకు పెరుగనున్నది. భూగర్భ జలాలు పెరగడంతో రైతులందరూ వరి సాగుపై మొగ్గు చూపుతున్నారు.
– సన్నిరాజు, ఏఓ