నల్లగొండ, ఫిబ్రవరి 7 : రైతులు భూ సంబంధ సమస్యలు పరిష్కరించుకునేందుకు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో ధరణి సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, దానిని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రైతులకు సూచించారు. కలెక్టరేట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన ధరణి కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించి మాట్లాడారు. రైతుల సౌకర్యార్థం ఈ ధరణి కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. ఈ కార్యాలయంలో ఒక సూపరింటెండెంట్తోపాటు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు పని చేస్తారని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల మ్యుటేషన్, సర్వే నంబర్లు, విస్తీర్ణం, నిషేధిత జాబితా తొలగింపు తదితర సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ చెక్ చేస్తారని తెలిపారు. ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు జతచేయాలనే విషయాలపై రైతులకు ఇక్కడి సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు.
ఇరిగేషన్ కార్యాలయాన్ని త్వరగా మార్చాలి
క్లాక్ టవర్ సెంటర్లోని ఇరిగేషన్ కార్యాలయాన్ని పాత జడ్పీ కార్యాలయంలోకి త్వరగా మార్చాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఆయన ఇరిగేషన్, పాత జడ్పీ కార్యాలయాలను పరిశీలించి మాట్లాడారు. పాత జడ్పీ కార్యాలయంలో కావాల్సిన ఏర్పాట్లు చేసి అవసరమైన చోట్ల టైల్స్, మ్యాట్లు వేయాలని సూచించారు. పార్టీషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు ఇబ్బంది కలుగకుండా మౌలిక వసతులు కల్పించాలని, తాగునీటితోపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయన వెంట పీఆర్ఈఈ తిరుపతయ్య, డీఈ నాగయ్య, భిక్షపతి ఉన్నారు.