యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న నిర్వహించనున్న టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో అధికార యంత్రాంగం, పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 12న భువనగిరిలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజల కర్తవ్యం వంటి విషయాలపై సీఎం కేసీఆర్ సభ వేదిక ద్వారా వివరిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేగంగా జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. దేశంలోనే అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు సాధించిన జిల్లాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రికార్డు సాధించిందన్నారు. ఒకప్పుడు భువనగిరి, ఆలేరు ప్రాంతాలు సమస్యలకు నిలయాలుగా ఉండేవని, సీఎం కేసీఆర్ యాదాద్రిభువనగిరిని జిల్లాగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారని అన్నారు. యాదాద్రి ఆలయం వెయ్యేండ్ల పాటు నిలిచిపోయే అద్భుత నిర్మాణమని, సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆలయం అద్భుతంగా రూపు దిద్దుకున్నదని పేర్కొన్నారు. ఉద్యమ సందర్భంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రస్తుతం అదే జరుగుతున్నదన్నారు. ప్రజలు ఆశించిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నదో తెలిపేందుకు ఈ నెల 12న భువనగిరికి వస్తున్న సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. కలెక్టర్ పమేలా సత్పతి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అమరేందర్ పాల్గొన్నారు.
నేటి సన్నాహక సమావేశానికి మంత్రి హాజరు
భువనగిరి అర్బన్ : కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి ఈ నెల 12న సీఎం కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించే సన్నాహక సమావేశానికి విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీ.కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే సమావేశానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి హాజవుతారని తెలిపారు. సమావేశానికి పట్టణ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ, అనుబంధ కమిటీల సభ్యులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.