నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్30(నమస్తే తెలంగాణ) : మంత్రి జగదీశ్రెడ్డిపై ఎలక్షన్ కమిషన్ ద్వారా బీజేపీ చేసిన కుట్రలపై
ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. 48గంటల పాటు ప్రచారం నిర్వహించవద్దన్న ఈసీ ఆదేశాలపై మాట్లాడారు. ‘మంత్రి జగదీశ్రెడ్డి లేకుండా 20 ఏండ్లలో ఏ సభలో కూడా మాట్లాడలేదు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నోడు. నేను బాధతో వచ్చిన. ఏం తప్పు చేసిండని జగదీశ్రెడ్డిని మునుగోడు నుంచి పంపించారు? ఎందుకు నిషేధించారు? ఏమైనా గూండాగిరి చేసిండా? ఎవర్నైనా కొట్టిండా? దౌర్జన్యం చేసినామా? అసలు టీఆర్ఎస్కు ఆ చరిత్ర ఉన్నదా? వామపక్షాలకు ఆ చరిత్ర ఉన్నదా? ఏం దౌర్జన్యం చేసినమని? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నం.
ఈ రోజు ఆ బాధ ఉంది. వీటన్నింటికీ జవాబు 3వ తారీఖున చెప్పాలి. అప్పటి వరకు అప్రమత్తులై ఉండి కచ్చితంగా ఈ చైతన్యాన్ని ఇట్లాగే కొనసాగిస్తూ శాంతియుతంగా వాళ్లకు బుద్ధి చెప్పాలని కోరుతున్నా.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు తరలివచ్చిన ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్రెడ్డి గురించి ప్రస్తావించినప్పుడు ప్రజల నుంచి ప్రతిస్పందన వచ్చింది. టీఆర్ఎస్ శ్రేణులు భావోద్వేగానికి లోనయ్యారు.‘తెలంగాణ మాదిరిగానే దేశాన్ని తయారు చేయాలని పుట్టుకొస్తుందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్కు పునాదిరాయి పెట్టే సువర్ణ అవకాశం మునుగోడు ప్రజలకే దక్కింది. సిద్దిపేట ప్రజలు నన్ను దీవించి తెలంగాణ పోరాటానికి పంపించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాను.
మునుగోడు విజయంతోనే దేశం బాగుపడుతది. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటా. మీకు అండదండగా ఉంటా’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. సీపీఎం, సీపీఐ మద్దతుతో బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆదివారం చండూరు మున్సిపాలిటీ బంగారిగడ్డ శివారులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మునుగోడు అభివృద్ధి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. గాడిదకు గడ్డేసి, ఆవుకు పాలు పిండితే రావన్నారు.
దేశంలో మోదీ ప్రభుత్వ విధానాలపై పదునైన విమర్శనాస్ర్తాలు సంధిస్తూనే జాతీయ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక ప్రాధాన్యతను వివరించారు. బీజేపీ దుర్మార్గాలపై తీవ్రంగా స్పందించారు. మునుగోడులో అవసరం లేని ఉప ఎన్నిక తెచ్చారని, ఫలితం ఏంటో కూడా ప్రజలు ఇప్పటికే తేల్చేశారని తెలిపారు. ఎంతవరకైనా కొట్లాడి మునుగోడులో ప్రతి ఎకరాకూ సాగు నీరు తెస్తానని ప్రకటించారు. ‘చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఎవరు చేయాలి? ఆపుతున్నది ఎవరు’ అని ప్రశ్నిస్తూ కృష్ణాజలాల్లో వాటాను తేల్చడానికి మోదీకి ఎనిమిదేండ్లు కూడా సరిపోవడం లేదా? అని ఎద్దేవా చేశారు. ఇక్కడ వంద పడకల ఆస్పత్రి, చండూరును రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతున్నారని, ప్రభాకర్రెడ్డికి ఓటేసి గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
నల్లగొండ ప్రతినిధి అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): “గోజసుంటి ప్రభాకర్రెడ్డిని ఓడగొట్టి గొడ్డలిని తెచ్చి పెట్టుకున్నరు. ప్రజల్లో ఉండే మనిషి, సామాన్యుడు, అరమరికలు తెలియని మనిషి ప్రభాకర్రెడ్డిని కాదని పోయిన ఎన్నికల్లో ఓ గొడ్డలిని తెచ్చి పెట్టుకున్నరు. ఆ గొడ్డలి పుణ్యమా అని రోడ్డు… ఏదీ సక్కగ లేదు. గెలిచినోళ్లు పత్తా లేకుండా పోయారు. ఓడిపోయిన ప్రభాకర్రెడ్డి మీ మధ్యలోనే ఉండి సేవ చేస్తున్నడు. ఈ ఉప ఎన్నికలో ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే అద్దాల్లా రోడ్లను బాగు చేయించే బాధ్యత నాది. పనులు, సేవ చేసే వ్యక్తి కావాలి. అలాంటి ప్రభాకర్రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే పనులైతయ్” అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు.
చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి. అలాగే ఓటు వేసే అప్పుడే జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే రావు. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. గత పాలకులు ఏనాడూ ఫ్లోరైడ్ గోసను తీర్చలేదని, తానే స్వయంగా ఇక్కడికి వచ్చి శివన్నగూడెంలో నిద్ర చేశానని వివరించారు. ఇక్కడి ప్రజలతో, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడి చైతన్యం తీసుకొచ్చానన్నారు. జలసాధన ఉద్యమ కారుడు దుశ్చర్ల సత్యనారాయణ అంశుల స్వామిని నాటి ప్రధాని వాజ్పేయి ముందు ఉంచినా పట్టించుకోలేదని విమర్శించారు. తానే ఈ సమస్యపై అప్పట్లో పాట రాశానని, ఇప్పుడు దాని ఆనవాళ్లు లేకుండా చేశానని చెప్పారు. మోటర్లకు మీటర్లు పెడతామంటున్న బీజేపీకే ఓటర్లు మీటర్లు పెట్టాలని పిలుపునిచ్చారు.
చేనేత బిడ్డలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మునుగోడులో చేనేత బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం నేతన్నలకు మోదీ చేసిండు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసి శిక్ష విధిస్తున్నాడు. ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయాలి? జీఎస్టీతో పన్ను పోటు వేస్తూ మళ్లీ ఓటు అడగడం మోదీకి ధర్మమేనా? ఇప్పటికే జీఎస్టీపై పోస్టు కార్డు ఉద్యమంపై నిర్ణయం జరగాలన్నా, జీఎస్టీ పోవాలన్నా ఓటు అనే ఆయుధంతో నేతన్నలు బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న బీజేపీకి మళ్లీ ఓటు వేయాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు. మునుగోడు చైతన్యవంతమైన గడ్డ అని, ఈ ఎన్నికలో మతోన్మాదులు పెట్టే దుర్మార్గపు ప్రలోభాలకు ఆశ పడితే గోస పడుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు, నల్లగొండకే కాదు రాష్ట్రం, భారత్కే నరకం చూపే జెండాలు మన మధ్య తిరుగుతున్నాయని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
చండూరులో నిర్వహించిన భారీ బహిరంగసభకు ఆశేష జనవాహిని తరలివచ్చింది. ఊహించిన దాని కంటే రెట్టింపు జనం రావడంతో బంగారిగడ్డ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. సభాస్థలికి నలువైపుల నుంచి ప్రజలు బారులు దీరారు. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకునే సరికి ఎటుచూసినా జనమే. ఇంకా చాలా మంది సభలోకి అడుగుపెడుతూ కనిపించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఆవాసం నుంచి సభకు జనం వచ్చారు. గ్రామాల్లోంచి అనుకున్న దాని కంటే ఎక్కువ మంది సభ కోసం సిద్ధం కావడంతో వాహనాలు సరిపడలేదు. దాంతో సభకు వచ్చిన ప్రతి వాహనం కిక్కిరిసిపోయింది. గ్రామాల నుంచే సుమారు లక్ష మందికి పైగా జనం సభకు వచ్చినట్లు అంచనా. వీరంతా సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా ఉన్న చోటనే వాహనాలు దిగి కాలినడకన వడివడిగా వచ్చారు.
మరోవైపు సభాస్థలానికి సమీప గ్రామాల నుంచి ప్రజలు పాదయాత్రలు చేస్తూ వచ్చారు. సుమారు 15కు పైగా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా కాలినడకన చేరుకున్నారు. వీరితో పాటు టీఆర్ఎస్ ఇన్చార్జీలు సైతం నడుస్తూ ఉత్సాహం నింపారు. కేవలం కాలినడకనే సుమారు 20 వేల మంది సీఎం కేసీఆర్ సభకు తరలిరావడం విశేషం. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో పాటు మునుగోడు అభివృద్ధి కోసం టీఆర్ఎస్ వెంట నడుస్తామంటూ కదలిరావడం అందరినీ ఆకట్టుకుంది.
దాంతో సభాస్థలానికి వచ్చే దారులన్నీ జనంతోనే నిండిపోయాయి. మునుగోడు, గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి మండలాల నుంచి అన్ని దారులు సభకు వచ్చే వారితోనే మూసుకుపోయాయి. ఇక సీఎం కేసీఆర్ సభాప్రాంగణానికి చేరుకునే సరికి సభా వేదిక నుంచి చండూరు- అంగడిపేట రోడ్డు వరకు జనం నిలబడి ఉన్నారు. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోవడంతో వేలాది మంది ప్రజలు తమ వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. వీరంతా దూరం నుంచే కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. సభ జరుగుతున్నంత సేపు సూర్యడు తన ప్రతాపాన్ని చూపినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. ఎండవేడిమిలో సైతం మహిళలు, వృద్దులు ఓపికగా కూర్చొని సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. బీజేపీ, మోదీ సర్కార్పై విమర్శలు సంధించినప్పుడల్లా సభా ప్రాంగణం చప్పట్లు, ఈలలు, కేరింతలతో దద్దరిల్లింది. సభ ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
3:48 : టీఆర్ఎస్ సభ ప్రాంగణం వద్దకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకున్నారు.
3.57: సభ ప్రాంగణంలోకి ప్రవేశించారు.
4.00: సభా వేదికపైకి వచ్చారు.
4.04 : కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
4.46 : ప్రసంగం ముగిసింది
4.56 : హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్కు బయల్దేరి వెళ్లిపోయారు.