నీలగిరి, ఫిబ్రవరి 7: నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందున పనులను మంగళవారం నుంచి ప్రారంభించాలని ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి ఆధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీట్ మార్కెట్లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగినందున పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ వయా పెద్ద బండ రహదారి అభివృద్ధ్ది పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో రూ.50 లక్షలతో ఏర్పాటు రైతు బజార్ ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నీలగిరి కళాభారతి, ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ పనులపై సమీక్షించారు. సమావేశంలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, కమిషనర్ డా.కేవీ రమణాచారి, టీయూఎస్ఐడీసీ ఎస్ఈ కందుకూరి వెంక టేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ నరేందర్, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, ఈఈ శ్రీనివాస్, డీఈ అశోక్ పాల్గొన్నారు.
కలెక్టర్ పీజే పాటిల్కు సన్మానం
నీలగిరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్గా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కలెక్టర్ బంగ్లాలో కలిసి పూల మొక్కను అందచేసి శాలువా కప్పి సన్మానించారు.