నార్కట్పల్లి, ఫిబ్రవరి 7 : ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వరకు ఆరు రోజులపాటు వైభవంగా సాగనున్న జాతరకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ లైట్లతో అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం నేటి రాత్రి (బుధవారం తెల్లవారు జామున) స్వామివారి కల్యాణోత్సవం, తలంబ్రాల వేడుకను కనుల పండువగా నిర్వహించనున్నారు.
500 మంది పోలీసులతో బందోబస్తు
గుట్టపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఇరువైపులా కర్రలతో రెయిలింగ్ ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమయ్యే కొబ్బరికాయలు, లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు సిద్ధ్దం చేసినట్లు అధికారులు తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం ఎల్లారెడ్డిగూడెం, నార్కట్పల్లి వైపు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తుండగా ముగ్గురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు విధులు నిర్వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. చెర్వుగట్టుకు వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నది.
80 సీసీ కెమెరాలు
ఉత్సవాల్లో భాగంగా గుట్ట కింద , ఆలయ ప్రాంగణంలో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని కంట్రోల్ రూమ్తో అనుసంధానించి పోలీసులు పర్యవేక్షించనున్నారు.
ప్రత్యేకంగా పార్కింగ్
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం గుట్ట కింద ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ ప్రదేశంలో అధికంగా వసూలు చేయకుండా ధరల పట్టికను ఏర్పాటు చేశారు. అలాగే వాహనదారులు రసీదు ప్రకారమే చెల్లించాలని అధికంగా వసూళ్లు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఉత్సవ కార్యక్రమాలు ఇలా..
మంగళవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
9న తెల్లవారుజామున 4 గంటలకు స్వామి కల్యాణోత్సవం
11 తెల్లవారుజామున 4 గంటలకు అగ్ని గుండాలు
12న ఉదయం 6 గంటలకు దోపోత్సవం
ఆశ్వవాహన సేవ కార్యక్రమాలు
అదే రోజు రాత్రి పుష్పోత్సవం, ఏకాంత సేవ
13న సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లారెడ్డిగూడెం,చెర్వుగట్టులో గ్రామోత్సవం
కొవిడ్ నిబంధనల కారణంగా తెప్పోత్సవం నిర్వహించడం లేదు.
స్వామివారి కల్యాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వం తరుఫున తలంబ్రాల బియ్యం, పట్టు వస్ర్తాలను సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ చైర్పర్సన్ మేకల అరుణా రాజిరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. గుట్టపై భక్తులకు సకల వసతులు కల్పించాం. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నాం
– మేకల అరుణా రాజిరెడ్డి, ఆలయ చైర్పర్సన్