‘మునుగోడు నియోజకవర్గ ప్రజలను పట్టి పీడించిన ఫ్లోరైడ్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతోనే విముక్తి లభించింది. నాలుగేండ్ల పదవీ కాలంలో రాజగోపాల్రెడ్డి మునుగోడుకు ఒరగబెట్టిందేమీ లేదు. ఇప్పుడు గెలిపించినా జరుగబోయేది ఏమీ లేదు. సమైక్య పాలకుల పాపం వల్లే ఫ్లోరైడ్తో మునుగోడు ఆగమైంది. ఫ్లోరైడ్ నియంత్రణకు నెదర్లాండ్స్ ఇచ్చిన రూ.375 కోట్ల ఆర్థిక సాయాన్ని ఆంధ్రాకు మళ్లించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మునుగోడుకు ప్రాజెక్టులు వచ్చాయి. కేసీఆర్ అంటేనే కాల్వలు, కుంటలు, చెరువులు. ఆర్థిక నేరగాళ్ల ఆధిపత్యంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. నియోజకవర్గంలో భూనిర్వాసితులకు ప్యాకేజీ రాకుండా చేసిన పాపం రాజగోపాల్రెడ్డిదే. కేంద్రం మోటర్లకు మీటర్లు పెడితే భూమంతా అమ్మినా బిల్లులు కట్టలేం. మునుగోడు ప్రజలు కచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించుకోవాలి’ అని ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్యూలో పలు విషయాలను వెల్లడించారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజలను పట్టి పీడించిన ఫ్లోరైడ్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతోనే విముక్తి లభించిందని ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మూడున్నరేండ్ల పదవీకాలంలో రాజగోపాల్రెడ్డి మునుగోడుకు ఒరగబెట్టిందేమీ లేదని, ఇప్పుడు గెలిపించినా జరుగబోయేది ఏమీ లేదని చెప్పారు. సమైక్య పాలకుల పాపంతోనే ఫ్లోరైడ్తో మునుగోడు ఆగమైందని చెప్పారు. ఫ్లోరైడ్పై మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
– యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)
ఏడు దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ నల్లగొండ జిల్లాను పట్టి పీడించింది. 1945లో అప్పటి నైజాం హయాంలో ఫ్లోరైడ్ను గుర్తించారు. 2003లో కేసీఆర్ ‘ఫ్లోరైడ్పై పోరుయాత్ర’ చేపట్టి, నాలుగు రోజులు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలోనే మా ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి కార్యాలయంలో 25మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలను తీసుకొచ్చి సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇంటింటికీ నీళ్లు, సాగు నీరు ఇస్తామని విజిటర్స్ బుక్కులో కూడా రాశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేపట్టిన మిషన్ భగీరథ నీటిని మునుగోడు నియోజకవర్గానికే తొలిసారిగా ఇచ్చారు. ఫలితంగా ఇప్పుడు జిల్లాలో ఫోరైడ్ తగ్గుముఖం పట్టింది.
మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ పాపం కచ్చితంగా అప్పటి సమైక్య పాలకులదే. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ నిర్మూలనకు ఏనాడూ ప్రయత్నించలేదు. 2001 వాల్టా చట్టం అమలు చేయకపోవడంతో ఇక్కడ దాదాపు 25 లక్షల బోర్లు వేశారు. 1,150 మీటర్ల లోతుకు వెళ్లారు. కిందికి వెళ్లే కొలదీ ఫ్లోరైడ్ శాతం పెరుగుతూ వచ్చింది. ఫ్లోరోసిస్ నియంత్రణకు నెదర్లాండ్ ప్రభుత్వం ఇచ్చిన రూ.375 కోట్లను కూడా దొడ్డిదారిన ఆంధ్రాకు తరలించుకొన్నారు.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ప్రజలకు ఏం ఒరగలేదు. ఒరగదు కూడా. రాజీనామాతో ప్రజలపై పెనుభారం మోపడం తప్పా. ఆర్థిక నేరగాళ్ల ఆధిపత్య పోరుతోనే ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు గెలిచేందుకు విచ్ఛలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఓ ఉద్యమకారుడిగా అడుగుతున్నా.. మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి ఏం చేశారు? రాజీనామాతో ఏం ఒరిగిందో చెప్పాలి. ఒక వేళ అభివృద్ధి జరిగిందనుకుంటే.. వాళ్ల అన్న, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా రాజీనామా చేయించాలి.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రంలోని బీజేపీ నాయకులు అంటున్నారు. 24 గంటలు మీట ర్లు నడిస్తే, నా భూమి మొత్తం అమ్మినా కరెంట్ బిల్లు కట్టలేను. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులు ఏం పాపం చేశారని ఉచిత కరెంట్ వద్దంటున్నారు. 130 కోట్ల మందికి అన్నం పెడుతున్న రైతు కన్నీరు పెడితే రాజ్యం నిలబడదు.
గతంలో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగానే ఉన్నా నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. అంతా ఆంధ్రా వాళ్ల పెత్తనం ఉండటంతో ఆయన వైఫల్యం చెందారు. తెలంగాణ వచ్చాక శివన్నగూడెంతోపాటు పలు ప్రాజెక్టులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హయాంలో శంకుస్థాపన చేశారు.
గతంలో ప్రభుత్వం భూనిర్వాసితులకు పరిహారం కింద ఎకరాకు రూ.5.15 లక్షలు ఇస్తుంటే రాజగోపాల్రెడ్డి అడ్డుకున్నారు. రూ.11 లక్షలు ఇప్పిస్తామని చెప్పి తీసుకోనివ్వలేదు. నిర్వాసితులు డబ్బులు తీసుకోపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఎకరం రూ.60 లక్షలదాకా పలుకుతున్నది. కనీసం ఇంటి స్థలం వస్తలేదు. అప్పుడే నిర్వాసితులు డబ్బులు తీసుకుంటే వేరే చోట భూములు కొనుక్కునేవారు. ఇది కచ్చితంగా రాజగోపాల్రెడ్డి తప్పిదమే.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ప్రజలకు ఏం ఒరగలేదు. ఒరగదు కూడా. రాజీనామాతో ప్రజలపై పెనుభారం మోపడం తప్పా. ఆర్థిక నేరగాళ్ల ఆధిపత్య పోరుతోనే ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు గెలిచేందుకు విచ్ఛలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఓ ఉద్యమకారుడిగా అడుగుతున్నా.. మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి ఏం చేశారు? రాజీనామాతో ఏం ఒరిగిందో చెప్పాలి. ఒక వేళ అభివృద్ధి జరిగిందనుకుంటే.. వాళ్ల అన్న, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా రాజీనామా చేయించాలి.