హాలియా, ఫిబ్రవరి 4:‘సర్కారు సదువులు సట్టు బండలు.. ప్రైవేటు బడులు వెండి కొండలు’ అన్నది ఇక గతమే. రాష్ట్ర ఆవిర్భావంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నది. తరగతి గదుల నిర్మాణం, విద్యా సంవత్సరానికి ముందుగానే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ, మౌలిక సౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. తాజాగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో అన్ని పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కొనసాగించనున్నాయి. అనుముల మండలంలో 1960 దశకంలో ప్రారంభించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాటికీ నేటికీ వైభవాన్ని చాటుతున్నది. అత్యధిక అడ్మిషన్లు, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఏటా కొత్తగా విద్యార్థులను ఆకర్షిస్తున్నది. హాలియాలో 10 ప్రైవేట్ పాఠశాలలున్నా జడ్పీహెచ్ఎస్కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. నూరు శాతం ఫలితాలకు తోడు సాంస్కృతిక, క్రీడా రంగాల్లోనూ విద్యార్థులు రాణిస్తుండడం ఉపాధ్యాయుల కృషిని చాటుతున్నది.
హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం 568 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దశాబ్ద కాలంగా పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటవుతున్నా.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండడం గమనార్హం. గతేడాది పాఠశాలలో 490 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది కొత్తగా మరో 78 మంది అడ్మిషన్ తీసుకున్నారు. దాదాపు ప్రతి తరగతి గదిలో 100 మందికి పైగా విద్యార్థులున్నారు. ఈ ఏడాది 10వతరగతిలో 140 మంది విద్యార్థులుండటం గమనార్హం.
నూరు శాతం ఫలితాలు..
హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు నమోదవుతున్నాయి. పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తుండగా మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులు ఏటా ట్రిపుల్ ఐటీకి ఎంపికవుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలను తలదన్నేలా స్టడీ హవర్స్ నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు.
దత్తత తీసుకున్న కస్తూరి ఫౌండేషన్…
పాఠశాల అభివృద్ధిలో కస్తూరి ఫౌండేషన్ సహకారం ఉన్నది. ఐదేండ్ల కిందట పాఠశాలను దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఏటా విద్యార్థులకు కావాల్సిన స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, పరీక్ష ప్యాడ్లు, డిక్షనరీలు అందిస్తున్నారు. కరోనా సమయంలో మాస్కులు, శానిటైజర్లు, వాటర్ బాటిళ్లు కూడా పంపిణీ చేశారు. గతేడాది లక్ష రూపాయల వ్యయంతో పాఠశాల భవనానికి రంగులు వేయించారు. 10/10 మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఏటా రూ.10వేల నగదు బహుమతి అందిస్తున్నారు.
ఇంగ్లిష్ మీడియంలో బోధన..
హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సక్సెస్ పాఠశాలగా గుర్తించి పదేండ్ల కిందటే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా మరికొన్ని పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టినా పెద్దగా మార్పు రాలేదు. కానీ, ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధించడంతో పాటు ఎప్పటికప్పుడు విద్యార్థుల పరిజ్ఞానాన్ని అంచనా వేస్తూ స్లిప్ టెస్టులు నిర్వహించేవారు. దాంతో ఆంగ్ల మాధ్యమం విజయవంతంగా కొనసాగుతున్నది. విద్యార్థుల అడ్మిషన్ల పెరుగుదలకు ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు.
ప్రణాళికాబద్ధంగా విద్యా బోధన…
పోటీ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. విద్యా బోధనకు తోడు సహ పాఠ్య అంశాల్లో మరింత తోడ్పాటు అందిస్తున్నాం. ఉపాధ్యాయుల సమష్టి కృషితో పాఠశాల మంచి ఫలితాలు సాధిస్తున్నది. పదో తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదవుతున్నది. విద్యతో పాటు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
– గుండా కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయుడు, హాలియా
దాతల సహకారం మరువలేనిది…
మా పాఠశాల అభివృద్ధిలో కస్తూరి ఫౌండేషన్ సహకారం ఎంతో ఉంది. పాఠశాల భవనాలకు మెరుగులు దిద్దడంతో పాటు విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. ఏటా స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, పరీక్ష ప్యాడ్లతో పాటు ప్రోత్సాహక నగదును కూడా ఇస్తున్నారు.
– చిలుకరాజు శ్రీనివాస్, తెలుగు ఉపాధ్యాయుడు
చక్కగా బోధిస్తున్నారు..
మా పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలంతో పాటు అన్ని రకాల సౌకర్యాలున్నాయి. ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టులను చక్కగా బోధిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఏడాది నేను 10 జీపీఏ సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదువుతున్నాను.
– ఆమని, 10వ తరగతి విద్యార్థిని