నీలగిరి, ఫిబ్రవరి 4 : చిన్నారులను వెట్టి నుంచి విముక్తి కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్-8 ముగిసింది. జిల్లాలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టిన కార్యక్రమంలో 83 మంది బాలకార్మికులకు స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించారు.బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు.
ఎనిమిది విడుతలుగా..
2015 నుంచి ప్రతి సంవత్సరం రెండు విడుతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్మిక, మహిళ శిశు సంక్షేమశాఖ, పోలీస్శాఖలతో పాటు, బాలల సంక్షేమ సమితి సంయుక్త ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వెట్టిలో మగ్గుతున్న, భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించడం, వారితో పనిచేయిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేయడం చేస్తున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు 8 పర్యాయాలు, 14 విడుతలుగా జిల్లాలో జరిగిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్లో 2002 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. 16 మంది దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేసి వారికి రూ.1.40 లక్షల జరిమానా విధించారు. గత జనవరిలో చేసిన ఆపరేషన్ స్మైల్, జూలై నిర్వహించిన ముస్కాన్లో నమోదు చేసిన 156 కేసులు లేబర్ కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ ఆపరేషన్ స్మైల్లో కూడా 71 కేసులు నమోదు చేసి 83 మంది బాలబాలిలను పనుల నుంచి విముక్తి కల్పించారు.
ఇతర రాష్ర్టాల పిల్లలే అధికం..
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ తనిఖీల్లో అధికంగా ఒడిశా, బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. పిల్లలతో ప్రమాదకర పనులు చేయిస్తున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వసతి గృహంలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో మూడు బృందాలు
జిల్లాలో ఆపరేషన్ స్మైల్-8ను విజయవంతం చేయడం కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రతి డివిజన్కు ఒకటి చొప్పున మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు బస్టాండ్, రైల్వే స్టేషన్లు, రోడ్లపై భిక్షాటన చేసే చిన్నారులు, దుకాణాలు, హోటల్స్, డాబాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు.
బాలలకు స్వేచ్ఛ, వికాసం అందించాలి
నిరాదరణకు, వెట్టి చాకిరీకి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం, చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు నింపేందుకే ఆపరేషన్ స్మైల్, ముస్కాన్లను నిర్వహిస్తున్నాం. జనవరి 1 నుంచి ప్రారంభమైన కార్యక్రమం విజయవంతం చేయడం కోసం జిల్లాలో ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతి బృందంలో ఇన్స్పెక్టర్ను కూడా నియమించాం. కొవిడ్ కారణంగా పాఠశాలలు నడవడం లేదని, ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలను పనుల్లో పెడుతున్న పరిస్థితులపై దృష్టి సారించాం. 83 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించి తల్లిదండ్రులకు అప్పగించాం. ఇందుకు బాధ్యులైన 71 మందిపై కేసులు నమోదు చేశాం.
– రెమా రాజేశ్వరి, ఎస్పీ