రామగిరి, అక్టోబర్ 4 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకొనే విజయదశమి వేడుకను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. దసరా సంబురాల్లో పాల్గొనేందుకు పట్టణాల్లో ఉండే వారంతో తమ స్వస్థలాలకు రావడంతో పల్లెలు సందడిగా కనిపిస్తున్నాయి. దసరా వేడుకల్లో భాగంగా శమీ పూజలు నిర్వహించేందుకు అంతటా ఏర్పాట్లు చేశారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో వాసవీ క్లబ్, ఎల్వీ సేవా సంస్థ ఆధ్వర్యంలో శమీపూజ, రావణ దహనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
మార్కెట్లు కిటకిట..
పండుగ వేళ మార్కెట్లో కోలాహలం నెలకొన్నది. వివిధ రకాల వస్తువుల కొనుగోలుదారులతో సందడిగా మారింది. బట్టలు, చెప్పులు, సెల్ఫోన్, గృహోపకరణాల కొనుగోళ్లతో దుకాణాలు కిక్కిరిసిపోయాయి. దీంతోపాటు మార్కెట్లో వ్యాపారులు పోటీ పడి ఆఫర్లు ప్రకటించారు. ముఖ్యంగా సెల్ఫోన్ దుకాణాదారులు దసరా ఆఫర్లను ఇస్తుండటంతో ఆ ప్రాంతాల్లో వినియోగదారుల రద్దీ కనిపించింది.
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ పట్టణంలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోని తమ స్వగ్రామాలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తుండగా.. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగింది. ముఖ్యంగా చౌటుప్పల్ బస్టాండ్ కూడలి ప్రాంతంలో, పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు దీరాయి. రోడ్డు దాటేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వచ్చిన వాహనాలను వచ్చినట్టుగా పంపించారు.
మహిషాసుర మర్ధిని అలంకారంలో రేణుకా ఎల్లమ్మ
భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం (పర్వతగిరి) రేణుకా ఎల్లమ్మ అమ్మవారు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చింది. ముదురు ఎరుపు రంగు చీరెతో అమ్మవారిని అలంకరించి గారెలు, పులిహోర నైవేద్యంగా సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
మహిషాసుర మర్ధినిగా అమ్మవారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద భక్తులు పూజలు చేశారు. నల్లగొండ పట్టణంలోని తులసీనగర్ సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారిని మహిషాసుర మర్ధినిగా అలంకరించగా.. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నల్లగొండలోని రాక్హిల్స్ కాలనీలో అమ్మవారి మండపం వద్ద రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వీటీకాలనీలోని శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసి దుర్గామాత వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
దసరా శుభాకాంక్షలు
ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించుకొని పవిత్రమైన జమ్మి చెట్టుకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం మనది. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదం అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం మంచి సంప్రదాయం. దసరా రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయం సాధిస్తామనే గొప్ప నమ్మకం ఉంది. దసరా పండుగను రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలి.
– గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనమండలి చైర్మన్
విజయదశమి స్ఫూర్తి కొనసాగాలి
విజయాలకు ప్రతిబింబంగా జరుపుకొనే విజయదశమి స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగాలి. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాధించిన విజయాలు దేశ ప్రగతికి దిక్సూచి కావాలి. దేశాభివృద్ధికి సీఎం కేసీఆర్ మార్గదర్శనం ఆవశ్యకత ఉన్నది.
– గుంటకండ్ల జగదీశ్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి