చండూరు, అక్టోబర్ 4 : మునుగోడు నియోజక వర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతుంది. చండూరు మండలంలో బీజేపీకి మరోమారు ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుకు చెందిన బ్రహ్మంగారి ఆలయ పాలకవర్గం మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో సిద్ది బ్రహ్మచారి, సిద్ది అమృతాచారి, సతీశ్చారితోపాటు వారి అనుచర వర్గం 30 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ నాయకుల మాయమాటలు విని మోసపోయామని, నిజం తెలుసుకొని తిరిగి టీఆర్ఎస్లోకి వచ్చినట్లు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీజేపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్నారాయణగౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు అచ్చిన శ్రీనివాస్ పాల్గొన్నారు.
పథకాలకు ఆకర్షితులయ్యే చేరికలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. సింగారం, కొంపెల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల ముఖ్య కార్యకర్తలు 60 మంది హైదరాబాద్లోని కూసుకుంట్ల నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సింగారం సర్పంచ్ గుర్రాల పరమేశ్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్యకార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని చిత్తుగా ఓడించాలన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నాంపల్లి : మండలంలోని పెద్దాపురం మాజీ సర్పంచ్ సూదనబోయిన యాదయ్య మంగళవారం హైదరాబాద్లో నాంపల్లి జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఇట్టెం వెంకట్రెడ్డి, గజ్జెల గెల్వాల్రెడ్డి, నడింపల్లి యాదయ్య పాల్గొన్నారు.