హాలియా, ఫిబ్రవరి 4 : కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమం, ప్రగతి ఆగలేదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారు ఇంటికెళ్లి శుక్రవారం కల్యాణలక్ష్మి చెక్కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి, సబ్బండ వర్గాల సంక్షేమం, బంగారు తెలంగాణ సాధనే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడంతో పాటు, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, బీమా పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్నారని ప్రశంసించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తెచ్చారన్నారు. దళితబంధు పథకంతో దళితుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ పారదర్శకంగా అందిస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరేలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగితే సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా పేదల ఇంటికే వస్తున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి అందిస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీరి వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, శంకరయ్య, పార్టీ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ వెంకటయ్య, మండల నాయకులు మట్టారెడ్డి పాల్గొన్నారు.
సాగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం : భగత్
సాగర్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల మండలంలోని కొట్టాల, చల్మారెడ్డిగూడెం, నాయుడుపాలెం, హజారిగూడెం, పేరూరు, పంగవానికుంట, కొత్తపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. అదేవివిధంగా మండలంలోకి పేరూరు గ్రామంలో రూ.5లక్షలతో నూతనంగా నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ పేర్ల సుమతితో కలిసి శంకుస్థాపన చేశారు. పంగవానికుంట గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీటీసీ రావుల రాంబాబు, ఆర్ఎస్ఎస్ మండలాధ్యక్షుడు చినభిక్షంయాదవ్, కుంటిగొర్ల పాపయ్య, సర్పంచ్లు పాల్గొన్నారు.