టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగను తలపిస్తున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు వేలాదిగా తరలివస్తుండటంతో ఊరంతా గులాబీమయమవుతున్నది. మర్రిగూడ మండల కేంద్రంలో శనివారం సాగిన సమ్మేళనం ఆత్మీయపలకరింపులు, ఆలింగనాలు, ధూంధాం ఆటలు, తెలంగాణ వంటకాలు, సామూహిక భోజనాలతో జాతరను మరపించింది. బోనాలు, బతుకమ్మలు, కళా ప్రదర్శనలతో సాగిన భారీ ర్యాలీ అందరినీ ఆకట్టుకున్నది. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా శనివారం మర్రిగూడ మండల కేంద్రంలో వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని చౌరస్తా నుంచి వేదిక వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం కళాకారులు నిర్వహించిన ధూంధాం పాటలు ఆకట్టుకున్నాయి. మర్రిగూడ, చండూరు మండలాల నుంచి సుమారు 200 మందికి పైగా టీఆర్ఎస్లో చేరారు.
– యాదాద్రిభువనగిరి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ)/మర్రిగూడ
మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పెద్ద పిచ్చోడని, సిగ్గు లేకుండా మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటని మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టాక బిల్లులు చేయకపోతేం ఇంకేం చేస్తారని ధ్వజమెత్తారు. దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మోడల్ను కేసీఆర్ దేశవ్యాప్తంగా తీసుకెళ్తారనే భయంతో బీజేపీ కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. మునుగోడు అభివృద్ధి పథంలో నడువాలంటే అది టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వచ్చిన ఆరేండ్లలోనే మునుగోడులో ఫ్లోరోసిస్ అంతమైందన్నారు. స్వార్థం కోసం రాజీనామా చేసిన రాజగోపాల్రెడ్డికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
వనభోజనాల తర్వాత కళాకారులు నిర్వహించిన ధూంధాం కార్యక్రమాలు అలరించాయి. తెలంగాణ ఆటపాటలతో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఉర్రూతలూగారు. చిన్నా, పెద్దా కేరింతలు కొట్టారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. పేరిణి నృత్యం సభికులను ఆకట్టుకుంది. అనంతరం తెలంగాణ పథకాలపై డాన్స్ కార్యక్రమం ఆలోచింపజేసింది. వేదికపై మహిళలు కోలాటం వేశారు.
కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్, చైర్మన్లు దంటు జగదీశ్, పందుల యాదయ్య, బాలం నర్సింహ, నాయకులు బచ్చు రామకృష్ణ, లపంగి నర్సింహ, ఐతగోని వెంకటయ్య, మారగోని రామన్న, పందుల రాములుగౌడ్, చెరు లింగంగౌడ్, నల్ల యాదయ్య, కల్లు నవీన్రెడ్డి, ఎన్.బిచ్చునాయక్, కట్కూరి వెంకటేశ్, యాకూబ్, ఊరిపక్క నగేశ్, గంట కృష్ణ, రాపోలు యాదగిరి, పందుల పాండుగౌడ్, కారింగు నర్సింహ, ఆంగోత్ హరిప్రసాద్, వల్లంల సంతోష్యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆటోలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, బైక్లపై స్వచ్ఛందంగా వచ్చారు. తండాలతోపాటు ఇతర గ్రామాల నుంచి కుటుంబాలతో కలిసొచ్చారు. సుమారు 12 వేల మంది టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు హాజరైనట్లు అంచనా. సీట్లు సరిపోకపోవడంతో అనేకమంది బయట నిల్చున్నారు. అంచనా వేసినదానికంటే అధికంగా తరలివచ్చారని టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మర్రిగూడ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా నుంచి ఉదయం 11 గంటలకు ర్యాలీ ప్రారంభించి.. మధ్యాహ్నానికి వేదిక వద్దకు చేరుకున్నారు. ఒగ్గుడోలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు, యువతులు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చారు. కోలాటాలు ఆడుతూ ముందుకు నడిచారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ర్యాలీ సాగింది. సుమారు ఐదు వేల మంది టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చిన బీజేపీ పార్టీ గిరిజనులను దగా చేసిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల గౌరవం పెంచేలా హైదరాబాద్లో సేవాలాల్ బంజారా భవనాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి స్వయంగా పాలించుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. 6 శాతం నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్ పెంచిన సీఎం కేసీఆర్కు గిరిజన లోకమంతా రుణపడి ఉండాలని సూచించారు. పోడు భూములపై హక్కు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న నేత అని కొని యాడారు. త్వరలో మునుగోడులో జరుగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసే నైతిక హక్కు లేదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా రాదని గ్రహించి అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని కొత్త నాటకానికి తెర లేపాడని మండి పడ్డారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలను మోసం చేసిన రాజగోపాల్రెడ్డి బుద్ధి చెప్పే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని గుర్తు చేశారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని పేర్కొన్నారు.
రూ.22వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయిన దొంగ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షం కాంగ్రెస్లో ఉంటే అభివృద్ధి చేయలేకపోతున్నాని చెప్పిన రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరి ఏం ఉద్దరిస్తాడో ప్రజలకు తెలుపాలన్నారు. ఆయన రాజీనామాతో శని వదిలిందని మునుగోడు ప్రజలు సంతోషపడుతున్నట్లు పేర్కొన్నారు. 2003లో మునుగోడు నియోజకవర్గం అనేక సమస్యలతో సతమతమైందన్నారు. చర్లగూడెంను చెరువుగా మారిస్తే చాలని ఈ ప్రాంత ప్రజలు కోరారని, కానీ, సీఎం కేసీఆర్ మాత్రం చెరువుతో సమస్యకు పరిష్కారం కాదని రిజర్వాయర్గా మార్చి వేల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించారని గుర్తు చేశారు. దాని ఫలితంగానే ఇవాళ రూ.2 వేల కోట్లతో శివన్నగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టులను నిర్మించకుంటున్నామన్నారు. 2018లో రాజగోపాల్రెడ్డి చెప్పిన మాయమాటలు నమ్మి ప్రజలు తప్పు చేశారని, మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఉప ఎన్నికలో కారు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ను గెలిపిస్తే కారు నిండా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.