రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తూ పాలన కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్రం పురోగతి సాధిస్తూ దేశానికే తలమానికంలా తయారైంది. గతంలో అనేక రంగాల్లో సామర్థ్యం ఉన్నప్పటికి అణచివేతకు గురికాగా నేడు కేసీఆర్ పాలనలో ఆయా రంగాల్లో నిపుణులైన వారికి ఇస్తున్న గుర్తింపు, అందిస్తున్న తోడ్పాటు, సహకారంతో ఆయా రంగాల్లో లెజండరీలుగా మారుతున్నారు. అనేక మంది కవులు, కళాకారులు, విద్యావేత్తలతో పాటు ఆయా రంగాల్లో నిపుణులైన వారికి ఉన్నత పదవులు దక్కి మంచి గుర్తింపు లభించింది. గతంలో ఈ ప్రాంతం నుంచి సినిమా నిర్మాణాల్లో కనీసం ఒక్కరైనా మచ్చుకు కనిపించకపోగా నేడు బుల్లితెరతో పాటు సినీ నటులు, గేయ రచయితలు అలాగే పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు ఎదిగారు. సినిమాలు, టీవీ సీరియల్స్లో ప్రాంతీయభాషకు ప్రాధాన్యత పెరుగడంతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న వారు లెజండరీలుగా మారుతున్నారు. ఇలా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు బాగుపడడంతో పాటు ఆయా రంగాల్లో ఉత్సాహవంతులకు ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రతి ప్రాంతంలో లోకల్ లెజండరీలు తయారవుతున్నారు. దీంతో వీరంతా సీఎం కేసీఆర్ తెలంగాణకే పరిమితం కాకుండా దేశానికి నాయకత్వం వహిస్తే దేశం పురోగతి సాధించడం ఖాయమని అంటున్నారు.
సీఎం కేసీఆర్తోనే పేదల జీవితాల్లో వెలుగులు
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అన్ని రంగాల కళాకారులను గుర్తించి ఆదుకున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. ఉద్యమాలకు ఊపిరిపోసిన కళాకారులను గతంలో ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. కళాకారులు పడ్డ కష్టాలను స్వయంగా ఉద్యమ నాయకుడిగా చూసిన కేసీఆర్ కళాకారులకు పెద్దపీట వేశారు. తెలంగాణలో సినీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో ఎంతో మంది కళాకారులు సినిమా, బుల్లితెర రంగాల్లో రాణిస్తూ ఉపాధి పొందుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలో వివిధ రంగాల్లోని కళాకారులకు మరింత గుర్తింపు లభిస్తుంది. తెలంగాణలోని సంప్రదాయ కళలకు దేశ వ్యాప్తంగా ప్రాధాన్యం లభించే అవకాశం ఉంటుంది. దేశంలో ప్రజారంజక పాలన అందిస్తున్న కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా పని చేయాలని కళాకారులు కోరుకుంటున్నారు.
– రేకల భిక్షం, రచయిత, జానపద కళాకారుడు, ఇస్మాయిల్పల్లి (కట్టంగూర్)
భవిష్యత్ దిక్సూచి సీఎం కేసిఆర్
ఉద్యమనేత సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తున్నది. గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారు. కళాకారులకు ఎవరూ ప్రవేశపెట్టని జీతభత్యాన్ని ప్రవేశ పెట్టాడు. కేంద్రం తీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలను అలవోకగా, చాకచక్యంగా క్లియర్ చేయగలిగే సత్తా ఉన్న కేసీఆర్కు దేశ రాజకీయాల్లోకి రావాలి. భవిష్యత్కు ఆయన దిక్సూచిలా కనిపిస్తున్నారు. ప్రజలు నిఖార్సయిన నాయకుడిని కోరుకుంటున్నారు. అది కేసీఆరే.
– పసుపులేటి చెన్నకేశవులు, జానపద కళాకారుడు, అడవిదేవులపల్లి
సీఎం కేసీఆర్తోనే కళాకారులకు సముచిత స్థానం
అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటంతో సాధించిన మహనీయుడు సీఎం కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం సాధించి సీఎం అయిన తర్వాత కళాకారులకు ప్రత్యేక స్థానం కల్పించి అందరిని అన్ని రకాలుగా ఆదుకున్నారు. మన రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం. జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలి. వైద్యం, విద్య, విద్యుత్, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందినట్లే.. దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే అది కేవలం దూరదృష్టితో ఆలోచించే సీఎం కేసీఆర్తోనే సాధ్యం.
– తిరుమలగిరి రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర రంగస్థల నాటక సమాజాల సమాఖ్య కోదాడ అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ దేశంవైపు చూస్తే అన్ని వర్గాలు బాగుపడతయ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రైతులు, వ్యవసాయ అనుబంధ సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు ఇలా ప్రతి ఒక్కరూ కాలుమీద కాలు వేసుకునేలా జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా 15 ఏళ్లుగా దేశంలోనే ఎవ్వరూ చేయని ఒల్లు గగుర్పొడిచే వండర్స్ నేను చేసినప్పటికీ తెలంగాణ ఏర్పాటు వరకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారు 2015 నుంచి నా వండర్స్ గుర్తించి ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానించి కొంత పారితోషికం ఇస్తున్నారు. సీఎం కేసీఆర్కు ఉన్న మానవీయత, కళలు ఇతర రంగాలపై ఉన్న మమకారంతో పాటు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో ప్రఖ్యాత అమెరికాస్ గాట్ టాలెంట్ షోతో పాటు మలేషియా, థాయ్లాండ్, సింగపూర్, నేపాల్ లాంటి అంతర్జాతీయ వేదికలపై షోలు చేసి అవార్డులు తీసుకున్నాను. సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే దేశంలో పండే పంటలను ప్రపంచానికి తినిపించేంత సత్తా ఆయనలో ఉందని నమ్ముతున్నాను.
– క్రాంతి, డ్రిల్మెన్(సూర్యాపేట)
సీఎం కేసీఆర్తోనే బలహీన వర్గాలకు న్యాయం
బడుగు, బలహీన వర్గాలకు సముచిత న్యాయం జరుగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎంతో మందికి లబ్ధి కలుగుతున్నది. తెలంగాణ మాదిరిగా దేశంలోనూ పథకాలను అమలు చేయగల నాయకుడు కేసీఆర్. మతోన్మాద రాజకీయాల నుంచి దేశానికి విముక్తి కలుగాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు రావాలి. తెలంగాణ రాష్ర్టాన్ని అలుపెరుగని పోరాటంతో సాధించిన విషయాన్ని ఏ ఒక్కరూ మరిచిపోరు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తారు. ప్రజలు కూడా ఆయన వెన్నంటి ఉంటారు.
– గోగికాల్ కిషన్లాల్,జానపద కళాకారుడు(దేవరకొండ)
ముందుచూపున్న నాయకుడు సీఎం కేసీఆర్
ప్రస్తుత తరుణంలో సీఎం కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. దేశ స్థితిగతులను మార్చే సత్తా ఆయనకే ఉన్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేద, మధ్య తరగతి కుంటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం ఆరేండ్లలోనే కేసీఆర్ చేసి చూపించారు. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేయడమే కాకుండా ఇయ్యని హామీలను నెరవేర్చి రాష్ట్ర ప్రజల మనస్సు దోచుకున్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని నిలిపారు. నాటి శ్రీకృష్ణదేవరాయ సంస్థానాన్ని తలపిస్తూ అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని రంగాలపై అవగాహన ఉండి ముందు చూపున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
– ఉడు సలేశ్వర్ యాదవ్, జానపద కళాకారుడు, కవి, గాయకుడు (దేవరకొండ రూరల్)
కళాకారుల ప్రతిభకు పట్టం కట్టిన నాయకుడు
హుజూర్నగర్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పడంలో కవులు, కళాకారులు కీలక భూమిక పోషించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారుల, కవుల ప్రతిభను గుర్తించి సముచితస్థానం కల్పించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సాహిత్యం, భాషపై పట్టున్న నేత కేసీఆర్. సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి జాతీయస్థాయిలో కీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తే గొప్ప మార్పు వస్తుంది. దేశ స్థితిగతులు మార్చగల సత్తా ఆయన సొంతం. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం దేశవ్యాప్తంగా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. – కొట్టుబాబు, రంగస్థల కళాకారుడు,హుజూర్నగర్
దేశ స్థితిగతులను మార్చడం కేసీఆర్తో సాధ్యం
ప్రస్తుత తరుణంలో కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. దేశంలో నెలకొన్న సమస్యలు, ప్రజల ఆకాంక్షలు నేరవేర్చే ఏకైక నాయకుడు అని పలు రాష్ర్టాల ప్రజలు విశ్వసిస్తున్నారు. అందరితో సమిష్టిగా పనిచేసే గుణం ఉన్న ఆయనకు దేశ స్థితిగతులను మార్చే సత్తా ఉన్నదని అందరూ భావిస్తున్నారు. గత పాలకుల కాలంలో 60 ఏండ్లుగా జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలో ఎనిమిదేళ్లలోనే చేసి చూపించారు. అందుకు నల్లగొండ జిల్లా కేంద్రం సహితం నిదర్శనమని పేర్కొనవచ్చు. రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు పథకాలు ఎందరికో భరోసా కల్పించాయి. సాధ్యం కాదు అన్న 24 గంటల విద్యుత్ను సుసాధ్యం చేసి చూపించారు. ఇలాంటి అభివృద్ధి అంతాట జరుగాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
– డాక్టర్ లింగనబోయిన లేఖానందస్వామి, ప్రముఖ నాటకరంగ నిపుణులు, నల్లగొండ