నందికొండ, ఫిబ్రవరి 4 : నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీగా ఏర్పడి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.15కోట్లతో రోడ్లు, ఆడిటోరియాలు, మంచి నీటివసతి లాంటి అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయన్నారు. చైర్పర్సన్ కర్న అనుషారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) నుంచి రూ.10కోట్లు, స్పెషల్ డెవలప్మెట్ నిధులు రూ.15కోట్లు నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. సమావేశంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.76లక్షలతో, 14-15 ఫైనాన్స్ కమిషన్తో రూ.1.20కోట్లతో నూతనంగా రోడ్ల ఏర్పాటు, పట్టణ ప్రగతితో కేటాయించిన రూ.12లక్షల నిధులతో నర్సరీల ఏర్పాటుపై తీర్మానాలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కోటిరెడ్డిని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, చైర్పర్సన్ కర్న అనుషారెడ్డి, కమిషనర్ రవీందర్రెడ్డి ఘనంగా సన్మానించారు. అవిధంగా పైలాన్కాలనీలో చేపడుతున్న 60 ఫీట్ల రోడ్డు విస్తరణతో తమ జీవనాధారమైన దుకాణాలు కోల్పోతున్న వ్యాపారస్తులు ఎమ్మెల్సీ కోటిరెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్ రామకృష్ణ, ఇందిర, రమేశ్జీ, నాగరాణి, మంగ్తా, సత్యమ్మ, శిరీషా, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.